నవ్యాంధ్ర...రుణాంధ్రగా మారుతోందా?...అవునంటున్న ఆర్థిక నిపుణులు:కారణాలివే!
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పుల అప్పారావులుగా మారిపోనున్నారని రాష్ట్రానికి చెందిన ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయితే ఇది వారు వ్యక్తిగతంగా చేస్తున్న అప్పులను బట్టి కాదని ఎపి ప్రభుత్వం ఎడాపెడా తీసుకుంటున్న రుణాలని బట్టేనని వారు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సుమారు రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చింది. అయితే తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 48 వేల కోట్లు తీసుకోవాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులేవీ అంతగా ఆర్థిక వనరులు సమకూర్చేవి కాకపోయినప్పటికీ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే...
అప్పులు... చెల్లింపులు:అనుమానాలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ది కోసం సుమారు రూ.48 వేల కోట్ల ఖర్చవుతుందని టిడిపి ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూవస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రూ.26 వేల కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతీ తెలిసిందే. మరోవైపు ఈ పనుల కోసం హడ్కో నుండి రూ.1275 కోట్లు రుణం తీసుకోగా వాటిని పూర్తిగా ఖర్చు చేశారు. అలాగే అమరావతి బాండ్ల రూపంలో సేకరిస్తున్న నిధులు రూ.2000 కోట్లను తిరిగి చెల్లించే సమయాన్ని మొత్తం లెక్కవేసుకుంటే సుమారు రూ.1500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని తేలింది. అయితే ఇలా అప్పు ఎంత తీసుకుంటే అంత మొత్తాన్ని లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించే పద్ధతి గతంలో ఎన్నడూ లేదని...దీని వెనుక ఏదో భారీ స్కామ్ ఉందనే అనుమానాలు ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆ అప్పులకు...తనఖా పెట్టాలి
నిజానికి హడ్కో నుండి తీసుకునే రుణానికి 8 శాతం లోపు వడ్డీ అయితేనే తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీచేసిన జిఓ నెంబరు 8లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు ఆరుశాతం వడ్డీకి విడుదల చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయినా బాండ్లకు మాత్రం 10.7 శాతం వడ్డీ చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బాండ్లకు భూములు తనఖా పెట్టాల్సిన అవసరం లేదని, ఇతర అప్పులకు మాత్రం ఆస్తులు తనఖా పెట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇష్టారాజ్యంగా...పన్నుల భారం
అయితే ఆ నిబంధన మేరకు ఇప్పటివరకు అప్పుతెచ్చిన 1.20 లక్షల కోట్లకు ఎక్కడెక్కడ ఆస్తులు తనఖా పెట్టారో తేలాల్సి ఉందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా హడ్కో తనఖా పెట్టుకునే ఆస్తులు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవిగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. విజయవాడ నగరానికి సంబంధించి గతంలో రూ.100 కోట్లు అప్పు తీసుకుంటే దానికి రూ.150 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టారు. అలాగే చెల్లింపుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. అలా అప్పును చెల్లించడం కోసం ప్రజలపై ఇష్టారాజ్యంగా భారాలు మోపారనేది విపక్షాల ఆరోపణ.
రాష్ట్ర ప్రజలపై...పెను భారం
రూ.1000 పన్ను చెల్లించే మున్సిపల్ కళ్యాణ మండపానికి దాన్ని రూ.10 వేలకు పెంచారని గుర్తుచేస్తున్నారు. ఈ అనుభవం దృష్టా చూస్తే భవిష్యత్లో ఎపి ప్రజలపై పెనుభారం పడనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏమేమి అప్పులు చేసింది...వాటి రీపెంట్ పద్ధతి ఏమిటనే అంశాలన్నీ బయటపెట్టాలని ప్రతిపక్షాలతో సహా ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అప్పును సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రజలు చెల్లించే పన్నుల్లో నుండే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అప్పులకు సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేది వారి విశ్లేషణ.