Paritala Sriram: టీడీపీకి ఫ్యామిలీ షాక్ ఇస్తారా? ఏమన్నారంటే !!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు టీడీపీ కీలక నాయకులు. ఎన్నికల సమయంలో పార్టీ నుండి వలసలు కొనసాగుతున్నాయి. అయితే ఊహించని విధంగా ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసింది ఎన్నికల కమీషన్ . ఇక ఇదే సమయంలో టీడీపీ నుండి కొనసాగుతున్న వలసల్లో భాగంగా ఇంకా చాలా మంది కీలక నాయకులు వై సీపీ నేతలకు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అందులో పరిటాల ఫ్యామిలీ ఉందన్న వార్త ప్రధానంగా వినిపిస్తుంది.
అనంతపురంలో కీలకమైన పరిటాల కుటుంబం పార్టీ మార్పు ప్రచారం
ఊహించని విధంగా దశాబ్దాల కాలంగా టీడీపీలో పని చేసిన కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్ళటం కొనసాగుతుంది.ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కీలకంగా టీడీపీ కోసం పని చేస్తున్న పరిటాల కుటుంబం టీడీపీని వీడనున్నారని ప్రచారం జోరుగానే సాగుతుంది. కీలకమైన పరిటాల ఫ్యామిలీ కూడా టీడీపీకి గుడ్బై చెప్తుందని జిల్లాలో వార్తలు గుప్పుమన్నాయి.
పార్టీలో ఉన్న విభేదాల వలన టీడీపీ నుంచి బయటకు అంటూ వార్తలు
పార్టీలో ఉన్న విభేదాల వలన టీడీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో పరిటాల కుటుంబం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వాటిపై పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ స్పందించారు. టీడీపీని వీడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆయన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు . తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు .
పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన లేదన్న శ్రీరామ్
మా నాన్న పరిటాల రవి సిద్ధాంతాలతో, ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నాం అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా ఇది నిరాధార వార్త అని ఆయన అన్నారు. టీడీపీ ని నమ్ముకున్న మా మీద, కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు అని తేల్చి చెప్పారు.
Recommended Video
తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి తమది కాదని ఆగ్రహం
ఇక అంతే కాదు తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి తమకు లేదన్నారు పరిటాల శ్రీరామ్. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని వివరించారు . తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పిన ఆయన ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండని పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు . మేము పార్టీ మారుతున్నట్లు జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అని శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు . పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చారు.