జనసేన నేతలూ జంపేనా ? .. పవన్ పార్టీ నేతలను కాపాడుకుంటారా ?
ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక లోక్ సభలో ఖాతానే తెరవలేదు .పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో జనసైనికులు నిరాశా నిస్పృహల్లో ఉన్న సమయంలో రాజకీయాలను వీడేది లేదు . నా ప్రాణం ఉన్నంతవరకు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తానని , పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్తానని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
అసెంబ్లీ వేదికగా జగన్ భజన చేస్తున్న ఒకే ఒక జనసేన ఎమ్మెల్యే రాపాక ... అసహనంలో శ్రేణులు
గత ఎన్నికల్లో వైయస్ఆర్సిపి విజయం సాధించి, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, జనసేన పార్టీ ఇక ఉండదు అని అందరూ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ పని అయిపొయింది అని అందరూ వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. . పవన్ కళ్యాణ్ తన సినిమాలకు తిరిగి వెళ్తాడని, అతను సినిమాల్లో నటించడం ప్రారంభిస్తాడని చాలా మంది భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేస్తానని , పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ఇక జనసేన నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనను అసెంబ్లీలో రిప్రజెంట్ చెయ్యాల్సింది పోయి జగన్ భజన అందుకున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం పార్టీ కేడర్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సిఎం వైఎస్ జగన్పై ఆయన ప్రశంసలు కురిపించారు. దేవుడితో పోల్చారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ క్యాడర్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా వైసీపీ బాట పడతారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.
సైలెంట్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ ... రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచన
భవిష్యత్ రాజకీయాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని పవన్ పార్టీని క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చెయ్యాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జనసేనలోకి వచ్చే నాయకులకు కూడా ఆయన రెడ్ కార్పెట్ పరవనున్నారు. కానీ జనసేన పార్టీ వైపు చూస్తున్న వారి కంటే జనసేన నుండి పక్క పార్టీల వైపు చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం ఇప్పుడు జనసేన పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు. జనసేనలో ఉంటె రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలో ఉన్నారని , తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు దారిలో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతుంది.
బలోపేతం చెయ్యటం సరే .. వలసలను పవన్ ఆపగలరా ?
ఒకపక్క ఏపీలో టీడీపీ ని ఖాళీ చేస్తామని బీజేపీ దూకుడు చూపిస్తున్న వేళ వైసీపీ నుండి జనసేన నుండి కూడా ఆషాడం తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక జనసేన నుండి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతలు ఎవరు అన్న చర్చ పార్టీలో జోరుగా ఆగుతుంది. ఒకపక్క గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకూ విరుద్ధంగా జగన్ భజన చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ అంశం కూడా పార్టీలో పలు సందేహాలకు తావిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో పార్టీని బలోపేతం చెయ్యటం అటుంచి పార్టీలో ఉన్న కీలక నేతలు పార్టీ వీడకుండా కాపాడే ప్రయత్నం పవన్ చేస్తారా ? జనసేనలో ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న నేతలు ఇప్పుడు జంప్ అంటారా ?అన్నది ఆసక్తికరంగా మారింది.