బాబు పాలనలో మంచినీళ్లూ దొరకడం లేదు: జగన్ ఫైర్, ‘ప.గోకు అల్లూరి పేరు’
పశ్చిమగోదావరి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 171వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో దారుణంగా చితికిపోయిన రొయ్యల, చేపల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే రొయ్యల రైతులకు అండగా సముద్ర తీరానా కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.
యూనిట్ కరెంటును రూపాయిన్నరకే అందజేస్తామని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు యూనిట్ కరెంటు ఐదు రూపాయలకే ఇస్తామని ప్రకటించారు. సీడ్ కొనుగోళ్ల నుంచి రైతు తన పంటను అమ్ముకునే దాకా మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను కూల్చేస్తామని, నిర్ణీత కాలంలోగా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మంచి నీళ్లు కూడా దొరకడం లేదు..
నాలుగేళ్లుగా చంద్రబాబు తమ నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రజలు, రైతులు వాపోతున్నారని జగన్ అన్నారు. ‘మంచినీళ్లు దొరకని పరిస్థితిలో ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. ‘మేము తాగుతున్న నీళ్లు ఇవి అన్నా!' అంటూ బాటిల్స్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు. చంద్రబాబు గారూ.. ఈ బాటిల్ లో ఉన్నది చెరుకురసం కాదు... తాగే మంచినీళ్లు! ఇదే నియోజకవర్గం చుట్టూ నీళ్లు కనిపిస్తాయి కానీ, తాగడానికి గుక్కెడు నీళ్లుండవు! గోదావరి నీళ్లు చూస్తే.. వర్షాకాలం తప్ప ఎప్పుడూ వదిలిపెట్టరు. బోర్లు వేస్తే ఉప్పునీళ్లు... తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారంటే ఎంత దారుణం! చంద్రబాబునాయుడు గారిని మీ అందరి తరపున నేను అడుగుతున్నాను.. రాజశేఖర్ రెడ్డిగారి పాలన రామరాజ్యం కాదా? అని అడుగుతున్నాను. మీ నాలుగేళ్ల పాలన రాక్షసపాలన కాదా?' అని జగన్ నిలదీశారు.
దళారీ వ్యవస్థతో మోసం.. ఆక్వాకు మద్దతు
‘మధ్దతు ధర లేక రైతన్నలు వరి అమ్ముకుంటున్నారు. ఆక్వా పంట చేతికొచ్చి అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కేజీ రొయ్య 460 ఉండాల్సి రెండు వందలు కూడా పలకడం లేదు. కేజీ చేపలు 110 ఉండాల్సింది 80 కూడా పలకకుండా ఇబ్బంది పడుతున్నారు. పంట చేతిరాక ముందు ధరలు బాగుంటాయని, చేతికి వచ్చిన తర్వాత వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. బాబు దళారీలతో కుమ్మక్కై ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. వర్షకాలం తప్ప నీరు అందుబాటులో ఉండటం లేదు. కాలువల్లో నీరు కనబడక అవస్థలు పడుతున్నారు. రొయ్యలు, చేపలు బతికించుకోవడానికి చెరువులు తవ్వితే నీరు కలుషితమవుతున్నాయి. చేపలు, రొయ్యలు, ఉత్పత్తి లేదని, హ్యార్చరీలు పుట్టగొడుగుల్లా వెలిసాయని, నాణ్యత లేని సీడ్స్ ఇస్తున్నారని, నాణ్యత పరీక్షించుకోవడానికి వెళ్తే ప్రభుత్వ ల్యాబ్లు మూసేశారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నియంత్రణ, నాణ్యత లేకపోవడంతో రైతులు మోసపోతున్నారు' అని జగన్ ధ్వజమెత్తారు.
మద్దతు ధర తీసుకొస్తాం..
‘మద్దతు ధరలేక అవస్థ పడుతుంటే రొయ్యల, చేపల దాణరేటు మాత్రం విపరీతంగా పెరుగుతుందన్నా అని వాపోతున్నారు.. సోయాబిన్, ఫిష్ ఆయిల్, నువ్వులు, ముడిపదార్థల రేటు తగ్గినా కూడా దాణా రేటు మాత్రం తగ్గడం లేదని అంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. దాణా ధరలపై నియంత్రణ ఉంటే రైతులకు మేలు జరిగేది. 15 నియోజకవర్గాలు కట్టబెడితే అండగా ఉండాల్సిన బాబు నాశనం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ప్రాసెసింగ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆక్వా రంగంలో ఉన్నందరికి ఆ దేవుని ఆశిస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలో వస్తే.. కరెంట్ యూనిట్కు 1.50 ఇస్తాము. అనుబంద ఫ్యాక్టరీలు, ఐస్, ప్రాసెంసింగ్ యూనిట్లకు 7 రూ నుంచి 5 రూ.తగ్గిస్తామని హామీ ఇస్తున్నాను. దళారీవ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తాను. అందరికీ తోడుగా ఉంటాను. కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయగలిగితే ఫుడ్ప్రాసెసింగ్లు ఉంటే ఈ పరిస్థితి రాదు. వీటిద్వారా 6నెలల వరకు నిల్వ ఉంచవచ్చు. మూడేళ్లలో వీటన్నిటిని సముద్ర తీరాన ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకొస్తాం' అని జగన్ హామీ ఇచ్చారు.
ఏపీలోనే పెట్రో బాదుడు ఎక్కువ
‘పెట్రోలు, డిజిల్లను మీ ట్రాక్టర్, బైక్లలో ఇక్కడ కొట్టించి.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొట్టించుకుంటే వ్యత్యాసం ఎంతో తెలుస్తోంది. ఎంత తెలుసా రూ. 7 ఎక్కువగా బాదుతున్నారు. నాలుగేళ్ల నుంచి ఇతర రాష్ట్రాల కన్నా రూ.7 ఎక్కవగా వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీలు తగ్గిస్తానన్నారు. కానీ కరెంట్ బిల్లులు బాదుతునే ఉన్నారు. అప్పుడు 100 లోపు కరెంట్ బిల్లు వచ్చేది. ఇప్పడు 500పైగా వస్తుంది. పెనాల్టీ కట్టకుంటే కరెంట్ కట్చేస్తున్నారు' అని జగన్ ధ్వజమెత్తారు.
ప.గోకు అల్లూరి పేరు
‘స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పశ్చిమగోదావరి జిల్లాకు పెట్టుకుని.. ఆ మహనీయుడిని సగౌరవంగా సన్మానించుకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ సరైన విధంగా గౌరవించలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి వచ్చిన క్షత్రియ కులస్తులు ఇదే విషయాన్ని గుర్తుచేశారు. రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..' అని వైయస్ జగన్ స్పష్టం చేశారు.