చిరు, పవన్కు చేత కానిది సోము వీర్రాజు చేసి చూపిస్తారా ? మనోడే సీఎం అవుతాడంటూ...
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు పేరుతో ప్రజారాజ్యం పార్టీని రంగంలోకి దింపిన చిరంజీవి రాజకీయాల్లో తగినంత అనుభవం లేకపోవడంతో అరకొర ప్రయోజనం మాత్రమే రాబట్టుకోగలిగారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్ధాపించినా 2019 ఎన్నికల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ దారుణంగా ఒక్క సీటు మాత్రమే తెచ్చుకోగలిగారు. స్వయంగా ఆయనే పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి చవిచూశారు. వీరిద్దరూ కాపు అజెండాను అంతర్గతంగా అమలు చేస్తూ సాధించిన ఫలితాలివి. అయితే చిరు, పవన్ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠమో, ఓపెన్గా ఉంటే తప్ప జనాల్లో ఓ మెసేజ్ పంపడం కష్టమని భావిస్తున్నారో తెలియదు కానీ 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
గవర్నర్తో భేటీ కానున్న సోము వీర్రాజు- అంతర్వేది సహా ఇతర అంశాలపై ఫిర్యాదు...
బీజేపీ ప్రత్యామ్నాయ వ్యూహం..
ఏపిలో దశాబ్దాలుగా రెండు సామాజికవర్గాలు రెండు పార్టీలకే కొమ్ము కాస్తూ మార్చి మార్చి వారికే అధికారం వారికే అప్పగిస్తున్న వేళ వీరికి పోటీగా మూడో వర్గాన్ని చీరదీయాలని బీజేపీ ఎప్పుడో నిర్ణయించుకుంది. అందుకే కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను 2019 ఎన్నికలకు ముందే అధ్యక్షుడిగా నియమించింది. అయితే కన్నా కూడా బీజేపీ అధిష్టానం వ్యూహాలకు భిన్నంగా తనకున్న పరిచయాలతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్ధితి. అయినా బీజేపీ మాత్రం కాపు మంత్రాన్ని వీడలేదు. కన్నా కంటే బలమైన ఆరెస్సెస్ నేపథ్యమున్న సోము వీర్రాజును రంగంలోకి దింపింది. దీంతోకాపు సామాజికవర్గం అధికంగా ఉండే గోదావరి జిల్లా నేపథ్యం కలిగిన సోము రాకతోనే సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది.
కాపుల్ని ఏకం చేస్తున్న సోము...
బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే సోము వీర్రాజు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి దెబ్బతిన్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు, మిత్రపక్ష నేత పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు. ఈ రెండు సమావేశాలు వారి అనుభవాలు తెలుసుకునేందుకు, వాటిని గుణపాఠాలుగా మార్చుకుని కాపుల కోసం మరో కొత్త అజెండా రెడీ చేసేందుకే అని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాపులతో పాటు వాటి అనుబంధ కులాలైన బలిజ, ఒంటరి, తెలగలను కూడా ఏకం చేయడం ఇప్పుడు సోము వీర్రాజు ముందున్న లక్ష్యం. ఇందుకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. వీరంతా ఏకతాటిపైకి వచ్చాక మిగతా సామాజికవర్గాలపై దృష్టిపెట్టొచ్చనేది సోము వ్యూహం.
ఈసారి మనోడే సీఎం అంటూ ఫోన్లు...
కాపుల జనాభా అధికంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కీలకమైన నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సోము సీరియస్ ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందుకోసం తన అనుచరులు, సన్నిహితులతో వారికి ఫోన్లు చేయిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు అండగా ఉన్న వీరిని తమవైపు తిప్పుకునేందుకు భవిష్యత్ వ్యూహాన్ని వారి ముందుంచుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కమ్మ, రెడ్డి నాయకత్వాల్లో ఉన్న ప్రభుత్వాలే అధికారం చెలాయించాయని, ఈసారి అలా జరగదని, కాపు సామాజిక వర్గానికే అధికారం దక్కబోతోందని, తమ సామాజిక వర్గం నేతే సీఎం కాబోతున్నట్లు సోము వీర్రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా మీరంతా ఏకతాటిపైకి వస్తేనే కాపులకు అధికారం దక్కుతుందని వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
Recommended Video
సోము వీర్రాజు ధీమా అదేనా ?
గతంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీ అనుభవాలతో పోలిస్తే జాతీయ పార్టీ అయిన బీజేపీ పరిస్ధితి వేరు. గతంలో పేరుకి పార్టీ ఉన్నా టీడీపీ అనుకూల ముద్రతో ఎక్కడ వేసిన ముద్ర అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే పరిస్ధితి. కానీ ఇప్పుడు సోము రాక తర్వాత బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మతపరమైన అజెండా మాట ఎలా ఉన్నా.. కాపులను ఆకట్టుకునే విషయంలో సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలకు మంచి స్పందనే లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్ధితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీ అయిన బీజేపీకే సాధ్యం అవుతుంది. అదే సమయంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి కూడా వ్యూహాల్లేకుండా ఎన్నికల్లో దెబ్బతిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని మిత్రపక్షం జనసేన ఉండనే ఉంది. ఈ రెండు అంశాలే సోములో ధీమా నింపుతున్నాయి. ఇందులో ఆయన విజయవంతమైతే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఖాయం.