టార్గెట్ 2019: బిజెపి ప్లాన్ ఇదే, టిడిపి, వైసీపీలకు ఇబ్బందేనా?
తిరుపతి: 2019 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఏపీ రాష్ట్రంలో బిజెపి స్వంతంగా బలపడేందుకు వ్యూహలు రచిస్తోంది. ఇందులో భాగంగానే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు బిజెపిలో చేరడంతో చిత్తూరు జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Recommended Video
చిత్తూరు జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికలను పురస్కరించుకొని టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
చిత్తూరులో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అమర్నాథ్రెడ్డిని మంత్రివర్గంలోకి కూడ తీసుకొన్నారు చంద్రబాబునాయుడు. ఈ తరుణంలో అమర్నాథ్రెడ్డి చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహన్ని రచిస్తున్నారు. అయితే ఇదే సమయంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు వైసీపీ నుండి బిజెపిలో చేరారు. దీంతో చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
సికెబాబు బిజెపిలో చేరికతో మారనున్న సమీకరణాలు
చిత్తూరు జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకొనే అవకాశం కన్పిస్తోంది. వైసీపీ, టిడిపిలకు ధీటుగా బిజెపి కూడ ఏపీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలను చేస్తోంది.ఇందులో భాగంగానే టిడిపి, వైసీపీల్లో లేని బలమైన నేతలకు బిజెపిలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బాగంగానే సికెబాబు లాంటి నేతలను పార్టీలో చేర్చుకొనే ప్రక్రియను ప్రారంభించింది.
స్వంతంగా బలపడేందుకు బిజెపి ప్లాన్
2019 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే విషయాన్ని బిజెపి ఇంకా ప్రకటించలేదు. 2019 ఎన్నికల వరకు టిడిపితో పొత్తు ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణలో మాత్రం బిజెపి ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. కానీ, ఏపీ విషయంలో పొత్తులపై స్పష్టత ఇవ్వలేదు. టిడిపితో పొత్తును కొందరు బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో స్వతహగా బలపడాలని ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్కు బిజెపి తెరతీసింది. ఇందులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ సికె బాబుతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన తర్వాత ఆయన బిజెపి తీర్థం పుచ్చుకొన్నారు.
చిత్తూరులో ఎవరిది పై చేయిగా మారేను
చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో కైవసం చేసుకొంది. టిడిపి కూడ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. ఈ తరుణంలోనే మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సోదరుడు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే కొంతకాలంగా ఈ ప్రచారం నిలిచిపోయింది. అయితే కిరణ్కుమార్రెడ్డి సోదరుడితో పాటు ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను కూడ టిదిపిలో చేర్చుకొనేందుకు టిడిపి జిల్లా నాయకత్వం, మంత్రి అమర్నాథ్రెడ్డిలు చక్రం తిప్పుతున్నారు.
2019 ఎన్నికలే టార్గెట్
2019 ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉన్నా లేకున్నా మరోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో టిడిపి వ్యూహలను రచిస్తోంది. బిజెపి కూడ అదే తరహలో ప్లాన్ చేస్తోంది. అయితే ఒంటరిగా పోటీచేసినా కనీసం రెండంకెల స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. కానీ, రాజకీయ సమీకరణాలు మారి వైసీపీతో బిజెపి పొత్తు పెట్టుకొంటుందా అనే చర్చ కూడ ఏపీలో సాగుతోంది. వైసీపీ చీఫ్ జగన్ బిజెపి నేతలతో సన్నిహితంగా మెలగడం కూడ ఇందుకు కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే అన్ని రకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బిజెపి వ్యూహం రచిస్తోంది. పవన్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టిడిపి వ్యూహలను రచిస్తోంది.