బీజేపీతో సర్దుకుపోతారా, సవాల్ చేస్తారా: అశోక్, సుజన ఏం చేస్తారు?
హైదరాబాద్: రైల్వే బడ్జెట్లో, సాధారణ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత లేదని నిప్పులు చెరుగుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఈ నెల 16వ తేదీన కేంద్ర బడ్జెట్ పైన చర్చ సందర్భంగా ధర్నా చేయాలని భావిస్తున్నారు. కేంద్రం పైన ఒత్తిడి పెంచి, రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఈ ఆందోళన చేయనున్నారు.
బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేదని, సాధారణ బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు.. తదితర ఏవి లేవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా, టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత మూడు రోజులుగా బీజేపీ పైన టీడీపీ నిప్పులు చెరుగుతోంది.
ఈ నేపథ్యంలో బడ్జెట్ పైన చర్చ సమయంలో ఆందోళన చేసి నిధుల కోసం ఒత్తిడి తీసుకు రావాలని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలో ప్రధాని మోడీ కేబినెట్లో ఉన్న అశోక గజపతి రాజు, సుజనా చౌదరిలు పాల్గొంటారా అనేది చర్చనీయాంశమైంది. బడ్జెట్లో ఏపీకి న్యాయం జరగలేదని సుజన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరు ధర్నాలో పాల్గొంటే ఓ చిక్కు, పాల్గొనకుంటే మరో చిక్కు!
ఇదిలా ఉండగా, బీజేపీ నేతలు మాత్రం ఏపీకి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రులు, నేతలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లి మాట్లాడుతామని, ఏపీకి జరిగిన అన్యాయం వివరిద్దామని చెబుతున్నారు. మరోవైపు, చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఢిల్లీ బాట పట్టనున్నారు.