సోనూసూద్కు చంద్రబాబు: మేం భరిస్తామని హామీ: త్వరలో కలుద్దామన్న యాక్టర్: స్పందించిన రైతు
అమరావతి: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మహల్ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్ను అందజేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్కు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సోనూసూద్ చర్యలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని చెప్పారు. నాగేశ్వరరావు కుమార్తెలకు చదువు చెప్పించే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని అన్నారు. వారు ఎంత వరకు చదవదలచుకున్నారో.. అంతవరకూ తాము చదివిస్తామని చంద్రబాబు చెప్పారు.
Recommended Video
ఇద్దరు కుమార్తెలతో కలిసి పొలం దున్నుతోన్న వీడియో
మహల్ రాజపల్లికి చెందిన నాగేశ్వర రావు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పొలం దున్నుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే సోనూసూద్ స్పందించారు. పొలం దున్నడానికి అవసరమైన ట్రాక్టర్ను అందజేశారు. ట్రాక్టర్ కొనిస్తానని మధ్యాహ్నం ట్వీట్ చేసిన ఆయన.. సాయంత్రానికి దాన్ని నాగేశ్వర రావుకు కుటుంబానికి పంపించారు. సోనూసూద్ తక్షణమే స్పందించడం పట్ల చంద్రబాబు ఆయనకు అభినందనలు తెలిపారు. పేదవారికి సహాయాన్ని అందించేలా స్ఫూర్తి నింపారని అన్నారు.
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్కు సోను సూద్ స్పందించారు. చంద్రబాబు ఇచ్చిన ట్వీట్కు సోనూసూద్ సమాధానం ఇచ్చారు. చంద్రబాబు తనను అభినందించడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. పేదవారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. లక్షలాది మంది వారి కలలను సాకారం చేసుకోవడానికి చంద్రబాబు మార్గదర్శకం చేశారని అన్నారు. చంద్రబాబు ఇలాగే స్ఫూర్తి నింపుతూనే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో చంద్రబాబును కలుసుకుంటానని సోనూసూద్ తెలిపారు.
సోనూసోద్ కు రైతు కృతజ్ఙతలు
సోనూసోద్ చేసిన సహాయం పట్ల రైతు నాగేశ్వర రావు ఆయనకు కృతజ్ఙతలు తెలిపారు. తనకు ఏ మాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి ఆదుకోవడానికి ముందుకు రావడం ఆయనలోని మానవత్వాన్ని చాటుతోందని అన్నారు. సోనూసూద్ను రియల్ హీరోగా అభివర్ణించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్నారంటూ సోనూసూద్ గురించి తాను లాక్డౌన్ సమయంలో తెలుసుకున్నానని, ఇప్పుడు ఆయనే స్వయంగా తన కష్టాన్ని చూసి సహాయం చేశారని అన్నారు. ట్రాక్టర్ను ఇస్తానంటూ చెప్పిన సాయంత్రానికే దాన్ని తన ఇంటికి పంపించడం ఆయన గొప్పతనాన్ని చాటుతోంని అన్నారు.