స్ధానిక పోరుకు ముందే చేతులెత్తేస్తున్న టీడీపీ...వైసీపీలోకి నేతల జంపింగ్ ల వెనుక అసలు కారణమిదే...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందని అనుకుంటున్నవేళ... వైసీపీలోకి ఒక్కసారిగా వలసలు పెరిగాయి. విపక్ష టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలు ఒక్కొక్కరిగా వైసీపీలోకి ఫిరాయిస్తున్నారు. దీంతో స్ధానిక పోరుకు ముందే టీడీపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో స్ధానిక పోరులో క్లీన్ స్వీప చేయాలని భావిస్తున్న వైసీపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.
వైసీపీలోకి టీడీపీ నేతల జంపింగ్
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరుకు నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో టీడీపీ నుంచి వైసీపీలోకి నేతల ఫిరాయింపులు మొదలైపోయాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి టీడీపీ నేతలు క్యూ కట్టడం మొదలుపెట్టేశారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి చెందిన సీనియర్ నేతలతో పాటు స్ధానిక ఎన్నికల్లో వైసీపీ నుంచి అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్న వారు, వారి బంధువులకు టికెట్లు కావాలనుకుంటున్నవారు కూడా ఉన్నారు. దీంతో సీఎం క్యాంపు కార్యాలయం ఇప్పుడు వలస నేతలతో కిటకిటలాడుతోంది. తాజాగా వైసీపీ కండువా కప్పుకున్న వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రెహమాన్, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు.
జాబితాలో సీనియర్లు, ఆశావహులు
ఇవాళ, రేపట్లో వైసీపీలో చేరుతున్న వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబూరావు, కడప జిల్లాకు చెందిన టీడీపీ నేతలు రామసుబ్పారెడ్డి, సతీష్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా ఒకప్పుడు విపక్ష పార్టీలో సీనియర్లుగా ఉంటూ గుర్తింపు తెచ్చుకున్నవారే. అయితే గత కొన్ని ఎన్నికల్లో వరుస ఓటములతో వీరు ఆయా జిల్లాల్లో నామమాత్రంగా మారిపోయారు. ఇప్పుడు వైసీపీలోకి రావడం ద్వారా కుదిరితే తాము లేకుండా తమ సన్నిహితులకు స్ధానిక పోరులో టికెట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు పదవులతో సంబంధం లేకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించడానికి ఇదే మంచి తరుణం అని భావిస్తున్నారు.
వలసల వెనుక అసలు కారణమిదే
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరుకు ముందే టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా పెరిగిన వలసల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. గతేడాది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత విపక్ష టీడీపీని గ్రామస్ధాయిలో నిర్వీర్యం చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇందులో విపక్ష నేతల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం, ఆస్తుల జప్తు చేయడం, అక్రమాలపై కేసులు నమోదు చేయడం, మాట వినని వారిపై దాడులకు తెగబడటం వంటివి ఇందులో కొన్ని మాత్రమే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అసలే ఓటమితో కుంగిపోయి ఉన్న వారికి మరోసారి డబ్బు ఖర్చు చేసి గెలిచే పరిస్దితి లేదు. దీంతో అధికార పార్టీకి సరెండర్ అయితేనే మంచిదన్న భావన వారిలో కనిపిస్తోంది.
కొంపముంచిన కొత్త రూల్స్
అసలే స్ధానిక పోరులో ఎలా పోటీ చేయాలని ఆలోచిస్తున్న నేతలకు స్ధానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతూ పట్టుబడితే జైలుకు పంపేలా, అనర్హత వేటు వేసేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన నిబంధనలు తీసుకు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఇదంతా టీడీపీ నేతలను కట్టడి చేసేందుకే అనేది వారికి కూడా తెలుసు. ఒకవేళ గెలిచినా కూడా అక్రమాలు రుజువైతే అనర్హత వేటు, జైలు శిక్షలు విధించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు టీడీపీని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో టీడీపీ నేతలంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని పరిస్ధితి పలుచోట్ల కనిపిస్తోంది.
మాట మార్చిన చంద్రబాబు..
వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీపై ఉద్యమాలు చేస్తున్న విపక్ష నేత చంద్రబాబు కొంతకాలంగా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ప్రజావ్యతిరేక వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బాబు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి సత్తా చాటడానికి బదులుగా చంద్రబాబు ప్రభుత్వాన్ని మళ్లీ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మద్యం, డబ్బు పంచితే అనర్హత వేటు, జైలు శిక్షలు విధించాలా నిబంధనలు తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో ఇంత తక్కువ టైమ్ లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని టీడీపీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తోంది. దీంతో చంద్రబాబు సైతం ఈ ఎన్నికలకు సిద్ధంగా లేరని తేలిపోయింది. కాబట్టి ఇక తమ దారి తాము చూసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. వైసీపీలోకి టీడీపీ నేతల ఫిరాయింపుల వెనుక ప్రధాన కారణం కూడా ఇదే.