ఏపీలో మూడు రాజధానుల ఆటకు కేంద్రం చెక్ పెడుతుందా?
ఏపీలో మూడు రాజధానుల రగడ మరింత పెరిగింది. ఒకవైపు శాసనసభలో అధికార వైసీపీ 3 రాజధానుల బిల్లును పాస్ చేసింది. మరోవైపు మండలిలో కూడా బిల్లును ఆమోదింపజేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా ఏపీని మూడు ముక్కలు చెయ్యాలని కంకణం కట్టుకుంది . అయితే రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత ప్రజలు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. పోలీసులు ఎంత అణచివేతలకు పాల్పడుతున్నా రాజధాని నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఇక ఈ వ్యవహారానికి, రాష్ట్రంలో ఆందోళనలకు అడ్డుకట్ట వేసేది ఎవరు ? కేంద్రం ఏమైనా ఏపీ రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా ? అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్న అంశం .
రాజధాని భవిష్యత్ కై రేపు ఢిల్లీకి వెళ్తున్న పవన్ .. బీజేపీతో కలిసి జగన్ పై జనసేనాని వార్
రాజధాని అమరావతినే అంటున్న చంద్రబాబు , జనసేనాని పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధానిగా అమరావతినే కొనసాగాలని స్టాండ్ తీసుకున్నారు . అమరావతి కోసం ఎంతవరకు అయినా పోరాటం చేస్తానంటూ చెప్తున్నారు . మరోవైపు ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రాజధాని అమరావతి కదలదు రాజధాని అమరావతినే అని చెప్పే వరకు జనసేన నిద్రపోదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు ..రాజధాని తరలింపును అడ్డుకుంటానంటూ, శాశ్వత రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక నేడు ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి కేంద్రం జోక్యం చేసుకోవాలని పవన్ కోరబోతున్నారు .
బీజేపీ రాష్ట్ర శాఖ స్టాండ్ కూడా అమరావతినే రాజధాని
ఇక వీరు మాత్రమే కాదు బీజేపీ నాయకులు సైతం రాజధానిగా అమరావతినే కొనసాగాలని స్టాండ్ తీసుకున్నారు .ఇక బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సైతం సరైన సమయంలో కేంద్రం జగన్కు షాక్ ఇస్తుందని , రాజధానిని ఇంచ్ కూడా కదిలించలేరని చెప్తున్నారు . అసలు ఈ ఇష్యూపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోక్యం చేసుకుంటుందా ? అంటే అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటె గతంలో కూడా చాలా సందర్భాల్లో కేంద్రం జోక్యం చేసుకోవటానికి వీలుండే ఎన్నో అంశాల్లో సైతం కేంద్రం జోక్యం చేసుకోలేదు.
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదంటున్న జీవీఎల్
ఇక రాజధాని వ్యవహారం పక్కాగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. ఒక వేళ జోక్యం చేసుకోటానికి చాన్స్ ఉన్నా అది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం . రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని జీవీఎల్ అంటున్నారు. రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించలేదని, మార్చాలని కూడా కేంద్రం చెప్పదని అన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే కేంద్రం సూచనలు చేస్తుందని వెల్లడించారు. గతంలో చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా నియంత్రించినప్పుడు కూడా కేంద్రం పెద్దగా కలగజేసుకోలేదని ఇక ఇప్పుడు కూడా జోక్యం చేసుకోదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జీవీఎల్ .
రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదన్న సుజనా
రాజధానిని కదిలిస్తే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, ఇలాగే కొనసాగితే పనామా, వెనెజులాగా మారుతుందన్నారు సుజనా చౌదరి . రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదని, పెద్దలతో చర్చించే ఈ విషయాలు మాట్లాడుతున్నానని ఆయన పేర్కొన్నారు . రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సరైన సమయంలో రంగంలోకి దిగుతుందని సుజనా పేర్కొన్నారు .
రాజధాని మార్చాలంటే కేంద్రం అనుమతి కావాలంటున్న కన్నా
ఇక కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం రాజధాని మార్చాలంటే కేంద్రం అనుమతి కావాలని చెప్తున్నారు . అయితే రాజధాని మార్పునకు అనుమతి కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాసినప్పుడు మాత్రమే అది స్పందిస్తుందన్నారు. పునర్విభజన చట్టం అమలుకు హోం శాఖ నోడల్ ఏజెన్సీగా ఉందని అందుచేత మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్రం అనుమతి తీసుకోవలసి ఉంటుందని కన్నా లక్షీనారాయణ అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందా ? అసలేం జరుగుతుంది అన్నది ఆసక్తికర అంశమే .