3 రాజధానుల రగడకు చెక్.. కేంద్రం చేతిలో ఉన్న ఆయుధం ఆర్టికల్ 3!
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు కేంద్రం తలుచుకుంటే ఏపీ రాజధాని తరలింపు ఆగదా? ఏకపక్షంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులకు చెక్ పెట్టలేరా ? అంటే కచ్చితంగా చెక్ పెట్టొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ తరహాలో ఎవరి ఇష్టానికి వాళ్ళు రాజధానిని మార్చే ప్రమాదం కూడా లేకపోలేదు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో మూడు రాజధానుల ఆటకు కేంద్రం చెక్ పెడుతుందా ? అసలేం జరుగుతుంది ?
ఏపీ బాటలో చాలా రాష్ట్రాలు ఈ తరహా నిర్ణయం తీసుకుంటే కష్టమనే భావన
ఒక దేశం యొక్క ఆర్ధిక ప్రగతి రాష్ట్రాల సమగ్ర ఆర్ధిక ప్రగతిపై ఆధారపడి ఉంటుంది అనేది నిర్వివాదాంశం. అలాంటి రాష్ట్రాలు ఆర్ధికంగా పరిపుష్టిగా ఉండాలి, అలాంటి చోట ఏపీ తరహాలో రాజధానులను మారుస్తూ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఆర్ధిక ప్రగతి శూన్యం అవుతుందన్న వాదన వినిపిస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వం ఇదే ప్రాక్టీస్ కు పాల్పడితే ఏ రాష్ట్రంలోనూ రాజధానులకు ఉనికే ఉండదు.మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది అన్నది చాలా మంది అభిప్రాయపడుతున్నారు .
కేంద్రానికి జోక్యం చేసుకోవటానికి ఉన్న వెసులుబాటు ఆర్టికల్ 3
ఇక ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతలా అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతలు కూడా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని , కేంద్రం జోక్యం చేసుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వాన్ని పదే పదే కోరుతున్నారు. అసలు రాజధాని విషయంలో జోక్యం చేసుకోటానికి కేంద్రానికి ఉన్న వెసులుబాటు ఏంటి ? అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం ఉందని.. రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
ఆర్టికల్ 3 తో రాజధాని తరలింపును కేంద్రం ఒక్క ఆదేశంతోనే ఆపొచ్చు
ఈ ఆర్టికల్ 3 ప్రకారం రాజధాని తరలింపును కేంద్రం ఒక్క ఆదేశంతో నిలిపివేయవచ్చని చెబుతున్నారు. అయతే అది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం . అయితే కేంద్రం ఇప్పటి వరకూ ఏపీ రాజధాని విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. కనీసం గవర్నర్ ద్వారా నివేదిక కూడా తెప్పించుకోలేదు. ఏపీ రాజధాని వ్యవహారంలో కేంద్రం తటస్థ పాత్ర పోషిస్తుందనే భావన చాలా మందిలో ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఏపీలో మరింత ఆందోళనకరంగా మారుతున్న వేళ కేంద్రం జోక్యంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆర్టికల్ 3 అస్త్రంగా కేంద్రం రిస్క్ చేస్తుందా ?
ఇక బీజేపీ వర్గాలు మాత్రం ఆర్టికల్ త్రీని అంత తేలిగ్గా ఉపయోగించుకునే అవకాశం లేదని, అందులోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నాయి . అయితే కేంద్రానికి అన్నీ తెలుసనీ, అంతా చెప్పే చేస్తున్నామని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ వర్గాలు అలాంటిది ఏమీ లేదని తిప్పి కొడుతున్నాయి. ఇది కూడా జోక్యం చేసుకోవడానికి ఓ కారణంగా మారొచ్చని నేతలు అంచనా వేస్తున్నారు. కానీ కేంద్రం ఆర్టికల్ 3 ప్రకారం రిస్క్ చేసి ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటుందా ? లేదా సైలెంట్ గా ఏం జరుగుతుందో చూస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.