జగన్ పాదయాత్ర: చరిత్ర సృష్టిస్తారా, బాబుకు ఇబ్బందేనా?
అమరావతి: పాదయాత్రలు చేస్తే అధికారంలోకి వస్తారా, గత చరిత్రను వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పునరావృతం చేస్తారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో సాగుతోంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్రలు నిర్వహించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబునాయుడులు ముఖ్యమంత్రులయ్యారు. జగన్ పాదయాత్ర ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
Recommended Video
ప్రజల వద్దకు వెళ్ళేందుకు రాజకీయ పార్టీల నేతలు పలు రకాల కార్యక్రమాలను ఎంచుకొంటారు. అయితే పాదయాత్రలు నిర్వహిస్తే నిత్యం ప్రజల మద్యే ఉండే అవకాశం దక్కనుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులకు ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయపరిస్థితులకు తేడా ఉంది. అయితే వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్రను నవంబర్ 6వ, తేదిన ప్రారంభించారు.
జగన్కు కౌంటర్: వ్యక్తిగతంగా తిట్టడం సంస్కారం కాదు: బాబు
వచ్చే ఏడాది మార్చి వరకు జగన్ పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఇడుపులపాయ నుండి ఇఛ్చాపురం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలను కూడ వివరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది.
2019 ఎన్నికల్లో పాదయాత్ర ప్రభావం కన్పించేనా?
2019 ఎన్నికల్లో పాదయాత్ర ప్రభావం ఉంటుందనే అభిప్రాయాన్ని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ఎన్నికలు ముందుగా వస్తే పాదయాత్ర ప్రభావం ఎన్నికల ఫలితాలపై కన్పించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.కేంద్రం కూడ నిర్ణీత షెడ్యూల్ కంటే ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ కేంద్రం బాటలోనే ఎన్నికలకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం కూడ ఉంది. ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎన్నికలు ముందస్తుగా వస్తే రాజకీయంగా టిడిపికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.పాదయాత్రలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం తమకు కలిసివచ్చే అవకాశం ఉందంటున్నాయి వైసీపీ వర్గాలు.
వైఎస్ రాజశేఖర్రెడ్డికి కలిసొచ్చిన పాదయాత్ర
2004 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో టిడిపి..బిజెపి మిత్రపక్షాలుగా ఉన్నాయి. 2001లో టిడిపిని వీడి కెసిఆర్ టిఆర్ఎస్ను ఏర్పాటు చేశారు.వరుసగా ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ ఛార్జీల పెంచుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఆనాడు సిఎల్పీ నాయకుడుగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నుండి పాదయాత్రను ప్రారంభించారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్రను చేశారు. అయితే ఈ పాదయాత్ర వైఎస్ఆర్కు రాజకీయంగా కలిసివచ్చింది. టిడిపికి ఈ పాదయాత్ర రాజకీయంగా నష్టం కల్గించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ ఛార్జీల పెంపు, వైఎస్ఆర్ పాదయాత్ర, తెలంగాణ ఉద్యమం టిడిపిని 2004లో ఓటమిపాలు చేసింది. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు ఈ యాత్ర ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబునాయుడు పాదయాత్ర
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్రను అనంతపురం జిల్లాలో ప్రారంభించి విశాఖలో బాబు ముగించారు. 2012 అక్టోబర్ 2వ, తేదిన అనంతపురం జిల్లా హిందూపురం వద్ద పాదయాత్రను ప్రారంభించారు.ఈ పాదయాత్ర సుదీర్ఘంగా సాగింది. బాబు పాదయాత్ర సాగే సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం సాగుతోంది. ఏపీ ప్రాంతంలో వైసీపీ చీఫ్ జగన్కు అనుకూలమైన వాతావరణం ఉంది. అయితే తెలంగాణ నుండి విజయం సాధించిన టిడిపి ఎమ్మెల్యేలు బాబు పాదయాత్ర సాగిస్తున్న సమయంలోనే పార్టీని వీడారు. ఏపీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కూడ వైసీపీలో చేరారు. బాబు చేసిన పాదయాత్ర టిడిపి ఉనికిని నిలబట్టేందుకు ఉపయోగపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేలా బాబు పనిచేశారు. మరోవైపు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణాలు తదితర హమీలపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఈ పాదయాత్రలోనే ప్రకటించారు. ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. ఏపీలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
వైఎస్ఆర్ మాదిరిగానే జగన్కు కలిసొచ్చేనా?
2004 ఎన్నికలకు ముందుగానే చంద్రబాబునాయుడు ప్రభుత్వం గద్దెదిగేందుకు వైఎస్ఆర్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కలిసివచ్చింది. అయితే ప్రస్తుతం వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత హమీలను విస్మరించారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఈ ఆరోపణలపై ప్రజలను నమ్మితే రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.