జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కు ఛాన్స్..!? మూడు నెలల తరువాతే: అక్కడే చిక్కు..ఏం జరుగుతోంది...!
స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తొలుత ఆరు వారాల పాటు వాయిదా..ఆ తరువాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే, దీనిని అంగీకరించటానికి సిద్దంగా లేని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఎన్నికల సంఘానికి మద్దతుగా తీర్పు వచ్చింది.అయితే,ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉంటుందని ఇచ్చిన ఆదేశాలను మాత్రం సుప్రీం కోర్టు రద్దు చేసింది.
ఫలితంగా కోడ్ సడలించారు. అయితే, అక్కడే చిక్కుముడి ఏర్పడింది. ఇప్పుడు దేశం మొత్తంగా కరోనా స్టేజ్ 2 కంటిన్యూ అవుతోంది. రానున్న రోజులు మరింత కీలమని చెబుతున్నారు. దీంతో..అసలు ఎన్నికలు ఆరు వారాల్లో సాధ్యమేనా..కోడ్ సడలించిన తరువాత ఇప్పటికే దాఖలైన నామినేషన్లు లైవ్ లో ఉంటాయా. తాజాగా నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలు.. కోర్టులో దాఖలైన కేసులు చూస్తుంటే..ఎన్నికల షెడ్యూల్ సైతం రద్దు చేసి..రీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీని పైన ఎన్నికల సంఘం మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్నికల పై కరోనావైరస్ ప్రభావం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించటం లేదు. దేశంలో, రాష్ట్రంలో కరోనా ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లు, పార్కులు తదితరాలను మూసేయాలని నిర్ణయిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు స్వదేశాలకు తరలివస్తే వారికి పరీక్షలు నిర్వహించడం, వారిని ఐసోలేషన్లో ఉంచడం తదితర ప్రక్రియలు చేపట్టాల్సి వస్తోంది. మున్ముందు వైరస్ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరు వారాలు కాదు..మూడు నెలలు..!
కరోనా ఉధృతి తగ్గితే వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. అయితే సుప్రీంకోర్డు ఆదేశాలతో మరో 4 వారాల పాటు ఎన్నికల కోడ్ అమలు చేసి ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఎస్ఈసీకి లభించింది. కరోనా వ్యాప్తి నిరోధానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అనుకున్నా.. ఆ తర్వాత ఎన్నికల కోసం మరో నెల పడుతుంది. అంటే ఇంకో మూడు నెలల తర్వాతే స్థానిక ఎన్నికలకు అవకాశముందనే అంచనాలు కనిపిస్తున్నాయి.
నామినేషన్ల ప్రక్రియపై ఆరోపణలు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల కోడ్ అమలు తాత్కాలికంగా వాయిదాపడింది. ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. కోడ్ అమల్లో లేని సందర్భంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశముంది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా జరిగినట్లు భావించే పరిస్థితులు ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియపై పలు ఆరోపణలున్నాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న ఈ అంశంపై కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. కోడ్ అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సబబని పలు రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
Recommended Video
ప్రక్రియ రద్దవుతుందా..అక్కడే చిక్కుముడి..
దీనిని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలా.. రద్దు చేయాలా అన్నది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. దీంతో..ఇప్పటి వరకు జరిగిన పక్రియ యధాతధంగా ఉంటుందని..భవిష్యత్ లో జరగాల్సిన వ్యవహారం మాత్రమే నిలిపవేసామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, కరోనా పరిస్థితుల నియంత్రణ..ఈ లోగా న్యాయస్థానాల సూచనలు..ఎన్నికల సంఘం తుది నిర్ణయం ఆధారంగా మొత్తం ఎన్నికల అంశం ఆధార పడి ఉంది.