'ఉండవల్లి, రఘువీరా వైసీపీ గూట్లోకి చేరే పక్షులే, జగన్ను రక్షించుకునే ప్రయత్నం'
విజయవాడ: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సీ రామచంద్రయ్యలు ఎప్పటికైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పంచన చేరుతారా? అంటే అవుననే అంటున్నారు టిడిపి నేత పయ్యావుల కేశవ్.
ఆయన సోమవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఉండవల్లి, రఘువీరా, రామచంద్రయ్య జగన్కు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా జగన్ గూటికి చేరే పక్షులేనని ధ్వజమెత్తారు.
వీరు జగన్ను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాజకీయ మనుగడ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేస్తున్నారన్నారు. రూ.10వేల కోట్ల నల్లధనం పై జగన్ భుజాలు తడుపుకుంటున్నారన్నారు.
కాగా, విభజన చట్టంలోని అంశాలను కూడా అమలు చేయించేకోలేని దుస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారని ఉండవల్లి ఉదయం విమర్శించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదేనని పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.
దానిని అమలు చేయించుకోవడం పక్కన పెట్టి ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించడం తగదన్నారు.రాష్ట్రంలో జీడీపీ 12.26శాతానికి పెరిగిందని అధికార పార్టీ ప్రచారం చేసుకుంటోందని, కానీ రెవెన్యూ రాబడులు కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నాయన్నారు. కేంద్రంలో జీడీపీ 7.3శాతం కాగా, రెవెన్యూ రాబడులు 26.4శాతంగా ఉన్నాయని తెలిపారు.