విజయసాయి లెక్క సరిచేస్తాడా ఏంటి..? పార్టీలో నంబర్ టూ గా ముద్రవేకున్న నేత..!!
అమరావతి/హైదరాబాద్ : వైసిపీలో అతనొక్కడే. ఢిల్లీ నుంచి గల్లీదాకా చక్రం తిప్పుతున్న ఏకైక నాయకుడు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు ఎంపి విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెరవెనక అన్నీ తానై వ్యవహరిస్తూ నంబర్ టూ స్థానాన్ని ఆక్రమించారు. వైసీపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా వ్యవహరించారు..? ఎవరికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి..? ఎవరి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలి అనే అంశంలో జగన్ కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్నా విజయసాయి రెడ్డి మాత్రం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పోలవరం టెండర్లు, రాజధాని నిర్మాణాల్లో అక్రమాలు, ప్రభుత్వ పథకాలు, నియామకాలు తదితర అంశాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపి రాజకీయాల్లో విజయసాయి పాత్ర..! వేసుకుంటున్నాడు తనదైన ముద్ర..!!
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి..సారీ వైసీపీ కీలక నేత అనాలేమో అనేంతగా ఎదిగారు. జగన్ కూడా తన తరువాతనే అనేంతగా చెలరేగిపోతున్నారు. ఇదంతా జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమా లేకపోతే తానే పూర్తిగా విజయసాయికి సరెండర్ అయ్యారా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. సీఎం వైఎస్. జగన్ జెరూసలేం వెళ్లటంతో నిర్ణయాలన్నీ విజయసాయి రెడ్డి మీదనే ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అధినేత జగన్ మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నపుడు టీడీపీ సాగించిన పెత్తనం, తమ పార్టీ నేతలను ఎంతటి ఇబ్బందులకు గురిచేశారనేది జగన్ వదిలేసి ఉండవచ్చేమో కానీ, విజయసాయి మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకే మొగ్గుచూపుతున్నారు.
తెరవెనక చక్రం తిప్పుతున్న సాయి..! జగన్ కు కీలక సూచనలు..!!
పోలవరంలో అవినీతితో నవయుగను బయటకు పంపారు. లేదా, 4500 కోట్ల రూపాయలను చేజిక్కించుకున్న నవయుగ ఇదొక అవకాశంగా భావించి వైదొలగనూ వచ్చు. ఎందుకంటే నవయుగ పూర్తిగా కమ్మ వర్గ కాంట్రాక్టర్ల సొత్తు. వైసీపీ రెడ్డి అండ్ కో వర్గానికే ప్రాధాన్యతనివ్వనూ వచ్చు. కాబట్టి ముందుగానే తప్పుకోవటం ద్వారా తమ పేరు ప్రతిష్ఠలను కాపాడుకున్నామనే భావన కూడా నవయుగలో ఉండి ఉండవచ్చు. ఏమైనా తాము అనుకున్నదే జరిగింది. ఇందులో విజయసాయి తెర వెనక నుండి కీలక భూమిక పోషించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర..! జాతీయ నేతలతో సానుకూల సంబంధాలు..!!
ఇప్పుడు అన్న క్యాంటీన్లలో 150 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలతో ఏకంగా క్యాంటీన్లను మూసివేయించారు. మంత్రి బొత్స మళ్లీ తెరుస్తామంటూ చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం అదంతా జరిగిన కథగా కొట్టిపారేస్తుంది. పాలనలో తన ప్రమేయం ఉందని చాటుకుంటూనే మరోవైపు టీడీపీ నేతలను విమర్శలతో ఏకిపారేస్తున్నాడు. లోకేష్ ను ఉద్దేశించి చిట్టినాయుడు అంటూ చురకలేస్తున్నాడు. చంద్రబాబు బండారం బయటపెట్టేందుకు కాలం ముందుందంటూ ఎద్దేవాచేశాడు. జగన్ వదిలేసిన విషయాన్ని విజయసాయి వెతికి మరీ గుర్తుచేసి ఎందుకిలా ప్రతీకారం కోసం పరితపిస్తున్నాడనేది మాత్రం వైసీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ప్రతీకార రాజకీయాలు..! చంద్రబాబు టార్గెట్ గా పావులు కదుపుతున్న విజయసాయి..!!
టీడీపీ శ్రేణులను బలహీన పరచటమేగాకుండా, వారిని మానసికంగా కుంగదీయాలనేది విజయసాయి ట్వీట్లు.. సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు కారణం కావచ్చంటూ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. పదేళ్లపాటు తాను చవిచూసిన చేదు అనుభవాలు.. జైలు జీవితాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ లకూ రుచి చూపాలనుకుంటున్నాడనే ప్రచారమూ ఉంది. ఇప్పటి వరకూ తమపై పడిన అవినీతి ముద్రను చంద్రబాబు కోటరీకూ అంటించాలనే వ్యూహంతో విజయసాయి పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది.