అలాగైతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసినడుస్తాం: వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బీజేపీతో పొత్తుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మరో ఆలోచన లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమన్నారు.
Recommended Video
అమరావతి: బీజేపీతో పొత్తుపై ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మరో ఆలోచన లేకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న పాదయాత్ర 900 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎన్ఎన్-ఐబీఎన్ చానెల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎవరిస్తే వారికి మా మద్దతు...
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హోదా ఇచ్చే అధికారం ప్రధానమంత్రికి ఉందని, ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా 2019 లో బీజేపీతో కలిసి నడవటానికి అభ్యంతరం లేదన్నారు.
చంద్రబాబు గట్టిగా అడగలేదు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా అడగకపోవడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అసలు సీఎం చంద్రబాబు నాయుడికి రాజధాని నగర నిర్మాణంలో చిత్తశుద్ధి ఏమాత్రం లేదని, ఆయన ఓవైపు ప్రధానమంత్రిని, మరోవైపు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ అన్నారు.
రాజధాని పేరిట భారీగా అవినీతి...
అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు కాలేదని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అంటూ కుంభకోణానికి తెరతీశారని, రాజధాని పేరుతో రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు.
మా ప్రధాన టార్గెట్ చంద్రబాబే...
బీజేపీతో కలవకూడదని అనుకోవడం లేదని, ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రధాన టార్గెట్ తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన అన్నారు. అసత్యాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...అబద్ధాలతోనే పాలన సాగిస్తున్నారంటూ జగన్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్లో ఉన్నంతకాలం కేసుల్లేవు...
తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం తనపై ఎలాంటి కేసులు లేవని, కాంగ్రెస్ నుంచి బయటికి రాగానే తనపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసే తనపై అక్రమంగా కేసులు పెట్టినట్లు చెప్పారు. ఓటుకు నోట్లు కేసులో.. ఆడియో, వీడియో టేపుల్లో సీఎం చంద్రబాబు దొరికిపోయినా ఆయనపై ఎలాంటి కేసులు లేవని జగన్ విమర్శించారు.
పాపం.. డిప్రెషన్లో జగన్: బుద్దా వెంకన్న
పాదయాత్రకు జనం కరువవడంతో పాపం.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, పులివెందులలో ఓడిపోతామన్న డిప్రెషన్లో జగన్ ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వెనుకబాటుకు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదులే కారకులని బుద్దా వెంకన్న ఆరోపించారు.
ఇప్పుడు మాట్లాడడం సమంజసం కాదు: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఆమె మాట్లాడారు. నిజానికి ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీతో సంతృప్తిని వ్యక్తం చేశారని, కాబట్టి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక ప్యాకేజీ కోరడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు.