చంద్రబాబు సర్వేలో పాల్ పార్టీకి 100 స్థానాలు .. బాబుకి రిటైర్మెంట్ ఇద్దాం ..కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుఏపీ ఎన్నికలపై నోరు విప్పాడు . అసలు పాల్ ఎప్పుడు ఎవరిని మెచ్చుకుంటారో,ఎవరిని తిడతారో కూడా అర్ధం కావట్లేదు. ఎన్నికల ముందు వరకు వైసీపీ పై నిప్పులు చెరిగిన పాల్ ఇప్పుడు తనకు తెలంగాణా సీఎం కేసీఆర్ కానీ ఏపీలో జగన్ కానీ శత్రువులు కాదని చెప్తున్నారు . తాను తలుచుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తానని చెప్పిన పాల్ ఇప్పుడు జనసేన ప్రభావం పెద్దగా ఉండబోదు అని చెప్తున్నారు. ఇక అన్నిటికంటే చంద్రబాబుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు .
చంద్రబాబుకు రిటైర్మెంట్ ఇచ్చి జగన్ తో కలిసి పని చేస్తానంటున్న కేఏ పాల్
చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ఇచ్చి మనిద్దరం ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ వైఎస్ జగన్ కు కేఏ పాల్ స్నేహ హస్తం అందిస్తున్నారు . ఇక ఏపీలో సీఎం ఎవరనేది నిర్ణయించేది తానేనని చెప్పుకొచ్చారు కేఏ పాల్ . ఈనెల 23న ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. తాను సరదాగా చెప్పటం లేదని ఫలితాల తర్వాత సీఎం ఎవరో తానే డిసైడ్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేయించిన సర్వేలో 100 స్థానాలకు పైగా ప్రజాశాంతి పార్టీ విజయం అని పాల్ సంచలనం
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేశారు . ఎన్నికల అనంతరం ఏపీలో తెలుగుదేశం పార్టీలో గెలిచే స్థానాలపై చంద్రబాబు సర్వే చేయించుకున్నారని పాల్ పేర్కొన్నారు. అయితే ఆ సర్వేలో ప్రజాశాంతి పార్టీకి 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని తెలిసిందన్నారు. అందుకే చంద్రబాబుకు రిటైర్ మెంట్ అని పేర్కొన్నారు.
జనసేన ప్రభావం 2 శాతమే
ఏపీలో చాలా మంది నీచ రాజకీయాలు చేస్తున్నారని , నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం బెటరని పాల్ అన్నారు . తనకు కావాలనే హెలికాఫ్టర్ గుర్తు కేటాయించారని చెప్పిన పాల్ ... కేఏ పాల్ అంటే ఎవరు నిజాయితీకి మారుపేరంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మనసు మార్చుకుంటారా అని ప్రశ్నించారు . మీ కోసం ప్రేయర్ చేయాలా అని చంద్రబాబును కేఏ పాల్ కోరారు. ఇక జనసేన ప్రభావం 2శాతం ఓట్లని పాల్ జోస్యం చెప్పారు. పాల్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఈసారి అవాక్కవటం జనసేనాని పవన్ కళ్యాణ్ , ఏపీ సీఎం చంద్రబాబు వంతు అయ్యింది.