విజయసాయి రహస్య భేటీ: గాలిని కలిసేందుకు జగన్ బెంగళూరుకు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డితో భేటీ కావొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గురువారం ఉదయం నాంపల్లి కోర్టు వద్ద ఎదురుపడ్డ జగన్, గాలి పలకరించుకున్న విషయం తెలిసిందే.
దానిని పక్కన పెడితే, గాలి జనార్ధన రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా కలిశారని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు బోండా ఉమ ఆరోపించినట్లుగా తెలుస్తోంది.
గాలి జనార్ధన రెడ్డితో జగన్కు సంబంధం ఉందని నిరూపిస్తే వైసీపీ నేత మూసేస్తామని భూమన కరుణాకర రెడ్డి సవాల్ చేశారని, ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి, జగన్లు ఆత్మీయ పరామర్శించుకోవడాన్ని ఎలా సమర్ధిస్తారని ఉమ ప్రశ్నించారు.
గాలి, విజయ సాయి రహస్య భేటీ ప్రచారం నేపథ్యంలో గాలితో జగన్ భేటీ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో జగన్ బెంగళూరు వెళ్లి గాలితో భేటీ కావొచ్చునని అంటున్నారు. గతంలో జగన్ను తన సోదరుడిగా గాలి పేర్కొన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు గురువారం ఉదయం నాంపల్లి కోర్టు వద్ద ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలకరించుకున్నారు.
తనకు ఎదురుపడిన గాలి జనార్దన్ రెడ్డిని చూసిన జగన్.. నమస్కారం పెట్టి, బాగున్నారా అంటూ పలకరించారు. దానికి ప్రతి నమస్కారం పెట్టిన గాలి.. బాగున్నానని చెప్పారు. ఇటీవల బెయిల్ పైన విడుదలైన గాలి తొలిసారి నాంపల్లి సీబీఐ న్యాయస్థానానికి హాజరయ్యారు.