డబుల్ ధమాకా: ఏపీకి ముఖ్యమంత్రి, లోకసభ ఎన్నికల తర్వాత జగన్ కింగ్ మేకర్.. ఎలా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 లోకసభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పనున్నారా? అంటే ప్రీపోల్ సర్వే ఫలితాలను చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏ ఒపీనియన్ పోల్ సర్వే చూసినా వైసీపీకి 13 సీట్ల నుంచి 23 సీట్లు వస్తాయని చెబుతోంది.
ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటులో మిగతా అన్ని పార్టీల కంటే కీలకం కానున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వే ఫలితాలను చూస్తుంటే ఎన్డీయేకు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 20 సీట్లు తగ్గనున్నాయి. మేజిక్ ఫిగర్ 272. కానీ ఎన్డీయేకు 252 సీట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు అయితే 120కి పైగా సీట్లు కావాలి.
టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండే: కారణం ఇదేనా?
జగన్కు ముఖ్యమంత్రి తోడు ఢిల్లీ చక్రం
ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ ఎన్నికల తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మరో ఇరవై సీట్లు తక్కువపడుతున్నందున.. వైసీపీకి 23 సీట్లు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నందున.. జగన్ కీలకంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంటే, ప్రీ పోల్ సర్వే లెక్కలను బట్టి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అవుతారని, అలాగే, ఢిల్లీలో చక్రం తిప్పుతారని వైసీపీ భావిస్తోంది.
చక్రం తిప్పిన తెలుగుదేశం
1984లో ఇందిరా గాంధీ మృతి అనంతరం జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 404 సీట్లు వచ్చాయి. దేశమంతా కాంగ్రెస్ హవా సాగినప్పటికీ ఏపీలో మాత్రం ఎన్టీఆర్ మేజిక్తో తెలుగుదేశం పార్టీ 30 సీట్లు గెలుచుకుంది. దీంతో ఎన్టీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లలో టీడీపీ చక్రం తిప్పింది.
టీడీపీ తర్వాత జగన్ చక్రం!
2004, 2009లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కానీ టీడీపీ ఆటలు సాగలేదనే చెప్పవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 2019లో వైసీపీ ఏకంగా 23 లోకసభ సీట్లు గెలుచుకోనుంది. అదే సమయంలో ఎన్డీయేకు 20 సీట్లు తగ్గనున్నాయి. దీంతో కేంద్రంలో జగన్ చక్రం తిప్పే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
టైమ్స్ నౌ సర్వే: మెజార్టీకి చేరువలో ఎన్డీయే, కాంగ్రెస్ ఆశలు గల్లంతు, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అంటే?
వైసీపీతో పాటు ఈ పార్టీలు.. బీజేపీకి దగ్గర
ఎన్డీయేకు 252 సీట్లు వస్తాయని తాజా ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. రానున్న మూడు నెలల్లో పరిస్థితులు మారుతాయని, బడ్జెట్ తర్వాత అనుకూలంగా ఉంటే ఎన్డీయే మెజార్టీ మరింత పెరుగవచ్చునని అంటున్నారు. ఇదే కాకుండా ఎన్డీయేలో లేకుండా.. బీజేపీకి దగ్గరగా ఉన్నట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్న పార్టీల్లో వైసీపీతో పాటు టీఆర్ఎస్, తమిళనాడు అన్నాడీఎంకే, ఒడిశా బీజేడీలు ఉన్నాయి. ఈ పార్టీలు కూడా మద్దతిస్తే ఎన్డీయే బలం 290కి చేరుకుంటుందని చెబుతున్నారు.