లోకల్ టాక్ : వైసీపీలో చేరనున్న వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ డీఎల్ రవీంద్రా రెడ్డి ?
ఏపీలో వలసల జోరు కొనసాగుతుంది. టీడీపీ నుండి కీలక నాయకులు వైసీపీ బాట పట్టారు. సీఎం జగన్ నేతృత్వంలో పని చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఇక ఈ సమయంలో వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడు , అత్యంత ఆప్తుడు డీఎల్ రవీంద్రా రెడ్డి కూడా వైసీపీలో చేరతారనే టాక్ వినిపిస్తుంది. అందుకు కారణాలు లేకపోలేదు.
టీడీపీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్బై: వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తోన్న బీసీ జనార్ధన్ రెడ్డి..
మరోమారు తెరపైకి ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా పని చేసిన నేతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన , అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా కొనసాగిన చాలా మంది నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. తెలంగాణతో పోల్చి చూస్తే ఏపీలో నాయకుల పరిస్థితి దారుణం . తెలంగాణలో నాయకులు కాస్తో కూస్తో కీలక పాత్ర పోషిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ నాయకులంతా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినా కొందరు పార్టీని వీడకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది .
వైఎస్సార్ కు మంచి మిత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి పై చర్చ
ఇక అలా ఒకప్పుడు రాజకీయాల్లో కీలక భూమిక పోషించి రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి వైఎస్సార్ కు మంచి మిత్రులుగా కొనసాగిన వారు డీఎల్ రవీంద్రా రెడ్డి . గత ఎన్నికల సమయంలోనే వైఎస్సార్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారిని వైసీపీలో చేర్చుకుని రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. తన తండ్రి వైఎస్సార్ తో ఉన్న అనుబంధం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేసి ఉండడంతో వారి అనుభవం తమ పార్టీకి ఉపయోగపడుతుంది అని భావించారు . కానీ అప్పుడు ఆయన పార్టీలో చేరలేదు.
డీఎల్ బంధువర్గమంతా వైసీపీలోనే
ఇక తాజాగా వైఎస్సార్ కుటుంబసభ్యుడిగా, వైఎస్సార్ క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరనున్నాడని తెలుస్తుంది. అందుకు కారణం ఇటీవల డీఎల్ బంధువర్గమంతా వైఎస్సార్సీపీలో చేరారు. డీఎల్ వియ్యంకుడు మాజీమంత్రి గాదె వెంకట్ రెడ్డి , డీఎల్ అల్లుడు కూడా జగన్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పటికే తన వారంతా వైసీపీ లో చేరటంతో ఆయన చేరిక కూడా లాంఛనమే అన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తం అవుతుంది. కడప జిల్లాకు చెందిన కీలక నేత కావటంతో జగన్ కూడా ఆయన చేరిక పట్ల సానుకూలంగా ఉన్నారు.
Recommended Video
కడప జిల్లాలో మంత్రిగా , కీలకంగా వ్యవహరించిన డీఎల్
ఇక వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడప లోక్ సభకు జగన్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక రావటంతో ఆ ఎన్నికలో జగన్ పై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన జగన్ చేతిలో ఘోరంగా పరాజయం పొందారు. ఆ ఎన్నికలో జగన్ 5.45 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ , టీడీపీ అని ఊగిసలాడారు కానీ అదేమీ సాధ్యం కాలేదు . ఇప్పుడు వైసీపీ లో చేరటం తాజా పరిణామాల నేపధ్యంలో పక్కా అని స్థానికులు భావిస్తున్నారు.