కిటికీలకు 73 లక్షలు.. రోడ్డుకు రూ.5 కోట్లు.. ప్రజాధనం దుర్వినియోగం.. జగన్ సర్కార్పై చంద్రబాబు ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ ఇంటి కోసం లక్షలు వ్యయం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్ ఇంటిలో కిటికీలు, తలుపుల కోసం రూ.73 లక్షలు ఖర్చుచేశారని పేర్కొన్నారు ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందని మండిపడ్డారు.
రూ.73 లక్షలా..?
సీఎం కార్యాలయం, ఇంటి కోసం లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తన ఇంటిలో కిటికీల కోసం జగన్ రూ.73 లక్షలు ఖర్చుచేయడం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. లోకేశ్ తర్వాత చంద్రబాబు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
రోడ్డు కోసం రూ.5 కోట్లు
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాధనాన్ని మంచినీళ్లుగా ఖర్చుచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెనికి రహదారి కోసం రూ.5 కోట్లు ఖర్చుచేశారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు ఎలక్ట్రికల్ పనుల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
హెలీప్యాడ్ కూడా..
ఇంటి సమీపంలో హెలిప్యాడ్ నిర్మించారని పేర్కొన్నారు. ఇందుకోసం మరో 1.89 కోట్ల వ్యయం అయ్యిందని తెలిపారు. ఇతర వసతుల కోసం రూ.3.25 కోట్లను అధికారులు ఖర్చు చేశారని తెలిపారు. జగన్ ఇంటి కోసం రూ.కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రజాదర్బార్ కూల్చారు..
తమ హయాంలో ప్రజల సమస్యలు వినేందుకు ప్రజాదర్బార్ నిర్మించామని చంద్రబాబు చెప్పారు. రూ.8 కోట్లతో వ్యయంతో పూర్తిచేసినట్టు గుర్తుచేశారు. దానిని అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేశారని మండిపడ్డారు. ఇందుకోసం రూ.82 లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు.
కేసీఆర్ కూడా..
తాము అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడినట్టు గుర్తుచేశారు. ఢిల్లీ గల్లీలో నినాదాలు చేసినట్టు తెలిపారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా 2016లో రూ.38 కోట్ల వ్యయంతో రాజభవనం నిర్మించారని చంద్రబాబు ఆరోపించారు.