ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు...
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశాలను తక్కువ రోజులకు కుదించారు. ఈ సమావేశాల్లో 11 చట్ట సవరణలు,3 ఆర్డినెన్స్ బిల్లులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి అక్టోబర్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ... ఆ తర్వాత నవంబర్కి వాయిదా వేసింది.కరోనా నేపథ్యంలో తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
Recommended Video
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్,రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్దమే నడుస్తున్న నేపథ్యంలో... అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం లేకపోలేదు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తుండగా... కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్న కారణంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోవట్లేదు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నిమ్మగడ్డ రమేష్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యవహారంపై నిమ్మగడ్డ రమేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.
కాగా,ఈ ఏడాది జూన్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టగా... వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో బడ్జెట్ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టారు.
అప్పటి సమావేశాల్లో ప్రభుత్వం కొత్తగా 11 బిల్లులను ప్రవేశపెట్టింది. పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం 15 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని శాసనసభలో తీర్మానం కూడా చేశారు. స్వల్పకాలిక చర్చలు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ చర్చలు లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.