వెదర్ అప్ డేట్: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
ఆంధ్రప్రదేశ్లో గతకొన్ని రోజులుగా మంచి వానలే కురుస్తున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం ఆంధ్రపద్రేశ్లోని కోస్తా ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినట్లు సమాచారం. మరోవైపు కరువు ప్రాంతంగా పిలువబడే రాయలసీమలో కూడా చెప్పుకోదగ్గ వర్షాలు కురిశాయి. గత మూడురోజులుగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతంలో నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు ఒంగోలులో 35మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా...కడప విజయవాడల్లో 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతిలో 7 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీవర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిషా తీరాన్ని వరకు ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సమయంలో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు రాయలసీమలో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్ మెంట్ తెలిపింది.
సెప్టెంబర్ 22 నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ తెలిపింది. గాలులు చిన్నగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వైపు కదులుతుండటమే కారణం అని వివరించింది. సెప్టెంబర్ 18నాటికి ఏపీలో 8శాతం తక్కువగా ఉన్న వర్షపాతం... కోస్తాంధ్రలో కురిసిన భారీ వర్షాలతో ప్రస్తుతం 4శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే రాయలసీమలో మాత్రం 35శాతం వర్షపాతం తక్కువగా ఉన్నట్లు సమాచారం.