జగన్ ప్రభుత్వానికి ఈసీ షాక్: ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్..!? వైసీపీ వాదన ఇలా..!
అమరాతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో ఎంపీటీసి, జడ్పీటిసి ఎన్నికలు ఒకే దశలో ..మున్సిపల్ ఒక విడుతగా ,పంచాయితీలు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 24న ఎంపీటీసి, జెడ్పీటీసి ఎన్నికల ఫలితాలు..27న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..29న పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే, ఈ ఉగాదికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది.
ఒకే సారి ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయించింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ ఉగాది నాడు ఆ కార్యక్రమం ఉంటుందా..లేక వాయిదా వేస్తారా అనే సందేహం మొదలైంది. అయితే, ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమం అయినా తాత్కాలికంగా నిలిపివేయాల్సిందే నని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో..ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకే దశలో జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలు... స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్..ఉగాది నాడు ఆగాల్సిందేనా..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు నిర్వహించటానికి వీళ్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకటించిన సమయం నుండి పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే వరకూ అంటే ఈ నెల 29వ తేదీ అర్థరాత్రి వరకూ కోడ్ అమల్లో ఉంటుంది. అయితే, ప్రభుత్వం సరిగ్గా ఈ సమయంలోనే అంటే ఈ నెల 25న ఉగాది నాడు ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసింది. అందు కోసం ఇప్పటికే కసరత్తు తుది దశకు చేరింది.
ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కి అన్ని ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా ఏపీలోని 25 లక్షల మంది పేదలకు జగన్ సర్కారు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తారు. దీనిలో భాగంగా.. 14,097 వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేక్..!? ఎన్నికల సంఘం ఏం చెప్పింది..
ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనే ఎన్నికల కమిషనర్ దీని పైన వివరణ ఇచ్చారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ కార్యక్రమం అయినా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఉగాది నాడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించినా..జిల్లా కలెక్టర్లు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటారని..కోడ్ పరిధిలో నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
కోడ్ ఉల్లంఘన కిందకు వస్తే వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని ఆయన మాటల్లో స్పష్టమైంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు..అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడంతో ఇప్పుడు దీని పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సైతం ఉగాది నాడు ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video
వైసీపీ వాదన ఇలా..
ఏపీ అధికార పార్టీ నేతలు మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా..ఇళ్ల స్థలాల పంపిణీకి మాత్రం ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఈ పథకం ఎన్నికల సమయంలో ప్రకటించినది కాదని.. దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న కార్యక్రమం అని చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో సైతం నాటి చంద్రబాబు ప్రభుత్వం పసుపు ..కుంకుమ పధకం కింద నగదు విడుదల చేశారని గుర్తు చేస్తున్నారు.
దీని పైన అభ్యంతరాలు వ్యక్తం చేసినా..అది ముందుగానే ప్రకటించిన కార్యక్రమం అని చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సంఘంతో ఉగాది నాడు ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అనుమతి తీసుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.