ప్రశాంత్ కిషోర్ సర్వేలపై జగన్, అవసరం లేదు.. సీనియర్ల సూచనకు నో
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చే నివేదికలపై ఎటువంటి అపోహలు వద్దని పార్టీ నేతలు, నాయకులతో వైసిపి అధినేత జగన్ సూచించారు.
అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చే నివేదికలపై ఎటువంటి అపోహలు వద్దని పార్టీ నేతలు, నాయకులతో వైసిపి అధినేత జగన్ సూచించారు.
హైదరాబాద్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో వైసిపి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ పని చేస్తోందని చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ టీంకు అధిక ప్రాధాన్యత సంకేతాలు
ప్రశాంత్ కిషోర్ సర్వేలపై అపోహలు వద్దని చెప్పడం ద్వారా ఆయన సూచనల మేరకే పార్టీ ముందుకు సాగుతుందని జగన్ చెప్పకనే చెప్పారు. పార్టీలో గ్రూపులు కట్టి విభేదాలు తీసుకు రావొద్దని చెప్పారు.
అసెంబ్లీకి వెళ్దామని నేతలు చేసిన సూచనను జగన్ నో
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కాబట్టి హాజరై ప్రభుత్వాన్ని నిలదీద్దామని కొందరు సీనియర్ నేతలు జగన్కు సూచించారు. అయితే అందుకు జగన్ నో చెప్పారు.
విమర్శలు రాకుండా ఎన్టీఆర్ పేరు
ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీకి రాకపోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా వైసిపి.. ఎన్టీఆర్ పేరును లాగింది. గతంలో తనకు జరిగిన అవమానాన్ని కారణంగా చూపి ఎన్టీఆర్ సమావేశాలకు హాజరు కాలేదు. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, వారిపై చర్యలు తీసుకుంటేనే హాజరవుతామని వైసిపి చెబుతూ... ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకున్నట్లు చెప్పింది. ఎన్టీఆర్ పేరు చెప్పి టిడిపికి కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేసింది.
నేతలకు జగన్ సూచన
రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల ద్వారా నేతలు ప్రజల్లో ఉండాలని, పార్టీలో వర్గ రాజకీయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జగన్ పార్టీ నేతలకు, నాయకులకు సూచించారు. కాగా, జగన్ నవంబర్ 6వ తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేయనున్నారు.