‘కాళ్ల కింద మోడీ’: గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నిరాకరించిన రోశయ్య
గుంటూరు: ప్రొటోకాల్ వివాదం తలెత్తుతుందనే కారణంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ముందే నిర్ణయించిన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఆయన చిలుకలూరిపేటలో పర్యటించి అక్కడ ఏర్పాటుచేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంంది. అయితే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు.
స్థానిక వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం రూపొందించిన ఆహ్వాన పత్రికలో పెద్ద సైజులో రోశయ్య ఫొటోను ముద్రించారు. ఆయన ఫొటోతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేతల పొటోలను ఆ పత్రికలో ముద్రించారు. అయితే రోశయ్య ఫొటో పెద్ద సైజులో ఉండి.. ఆయన ఫొటో కాళ్ల కింద ప్రధాని, అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపి సిఎం చంద్రబాబునాయుడుల ఫొటోలు ఉన్నాయి.
విగ్రహం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త ఘంటశాల బంగారుబాబు ఆరు నెలల క్రితమే తాను ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రోశయ్యను కోరగా.. ఆయన అందుకు అంగీకరించారు. అయితే ఆహ్వానపత్రికలో ప్రధాని, కేంద్రమంత్రి లాంటి జాతీయ నేతలు, సిఎం చంద్రబాబునాయుడుల ఫొటోలను రోశయ్య ఫొటో కాళ్ల కింద పెట్టడంపై స్థానిక బిజెపి నాయకులు పూర్ణచందర్ రావు తీవ్ర ఆగ్రమం వ్యక్తం చేశారు. ఇది వారిని అవమానించడమేనని ఆరోపించారు.
ఇది ప్రైవేట్ కార్యక్రమమే కాబట్టి ఆహ్వానపత్రికలో ప్రొటోకాల్ పాటించడం అనే ప్రశ్న తలెత్తదని ఓ సీనియర్ జిల్లా అధికారి తెలిపారు. ఆహ్వానాన్ని అంగీకరించాలా? నిరాకరించాలా? అనే విషయం వివిఐపిలదేనిన చెప్పారు. కాగా, తమిళనాడు గవర్నర్ రోశయ్య తన చిలుకలూరిపేట పర్యటనను రద్దు చేసుకున్నారని రాష్ట్ర సమాచార శాఖ అధికారులు తెలిపారు.
జాతీయ నేతలను తన ఫొటో కింద పెట్టడంపై వివాదం తలెత్తడంతో రోశయ్య తన పర్యనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యుపిఏ ప్రభుత్వం నామినేట్ చేయడంతో గవర్నర్ అయిన రోశయ్య.. బిజెపి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినప్పటికీ ఎన్డీఏ వేటు వేయలేదు. కాగా, రోశయ్య అభిమానులైన పలువురు ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో బంగారుబాబు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వ అనుమతితో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.