భ్రష్టు పట్టిస్తారా, కండకావరమా: మోడీపై బాబు తీవ్రవ్యాఖ్యలు, జగన్ కేసులపై కేంద్రమంత్రి ఇలా
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను భ్రష్టు పట్టించాలని బీజేపీ చూస్తోందని గురువారం వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మేం ఏం చేసినా చెల్లుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. అది సరికాదన్నారు.
మేం ఏం చేసినా చెల్లుతుందనే కండకావరం సరికాదన్నారు. తనను ఆంధ్రప్రదేశ్లో బలహీనపర్చాలని బీజేపీ భావిస్తోందన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలహీనపర్చి తాను బలపడాలని కమలం పార్టీ చూస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజల ఆకాంక్షలను ఆయన తుంగలో తొక్కారన్నారు.
'పవన్ విషయం తేలిపోయింది, ఎవరైనా అలా చెప్తారా?': మేలో ఆమరణ దీక్షకు ఛాన్స్
ఏపీలో అభివృద్ధి చేయక కేంద్రంపై నెపం
కాగా, బుధవారం చంద్రబాబు ఢిల్లీలో ఏపీ హామీలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ప్రకాశ్ జవదేకర్, జీవీఎల్ నర్సింహా రావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్ మాట్లాడుతూ.. చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, అందుకే కేంద్రం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి చేయలేకపోయామన్న భ్రమ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్త ట్విస్ట్ ఇచ్చారు.
కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా
దాదాపు రూ.16వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం ఇబ్బంది లేకుండానే స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారన్నారు. అయినా ఆ వంకతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు, టీడీపీ చూస్తున్నారన్నారు.
చంద్రబాబూ! ఏ రాష్ట్రానికి ఇచ్చామో చెప్పు
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇచ్చారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రత్యేక హోదా ఎవరికిచ్చామో చెప్పాలని నిలదీశారు. అలా ఇచ్చినట్లు ఏవైనా ఆధార పత్రం ఉంటే చూపాలన్నారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఏపీ ప్రజల్ని అనేక పార్టీలు దగా చేస్తున్నాయన్నారు. హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు.
సతాయించే అల్లుడిలా, భయం ఉండదా?
ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చింది ఆర్థిక ప్రయోజనాలని జీవీఎల్ మరోసారి చెప్పారు. చంద్రబాబు సతాయించే అల్లుడిలా మాట్లాడుతున్నారన్నారు. రూ.1050 కోట్లకు లెక్కలు చెప్పలేని వారు రేపు రూ.20వేల కోట్లు ఇస్తే ఏం చేస్తారో అనే భయం ఉండదా అని ప్రశ్నించారు. ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... రాజకీయంగా వైసీపీతో బీజేపీకి ఏవిధమైన సంబంధం లేదని తేల్చి చెప్పారు.
జగన్ కేసులపై జవదేకర్ ఇలా
వైసీపీతో బీజేపీ జత కట్టనున్నట్లు చంద్రబాబు చేసిన అరోపణలను అంతకుముందు ప్రకాశ్ జవదేకర్ తోసిపుచ్చారు. జగన్పై అవినీతి ఆరోపణల విషయంలో మోడీ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబించడం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందుకెళుతుండటాన్ని ప్రస్తావించగా... ఆ పోలికే సరికాదన్నారు. జగన్ కేసులకు సంబంధించి నిబంధనల ప్రకారం కేంద్ర సంస్థలు తమ పని తాము చేస్తున్నాయన్నారు.