కరోనా భయం.. దరికి రాని జనం.. మంటగలుస్తున్న మానవత్వం...
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా రక్కసి మన దేశంలోనూ వేలాది మంది ప్రాణాలు తీసుకునేలా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే.. మృత్యుఘోష ఆగడం లేదు. మరణమే దారుణమనుకుంటే... అంతకుమించిన దారుణాలను ఎన్ని చూడాల్సి వస్తుందో తెలియక ఇప్పుడు జనం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కరోనా మృతుల విషయంలో సమాజం స్పందిస్తున్న తీరు మానవత్వానికే మాయని మచ్చగా మారుతుందన్న అంచనాలున్నాయి.
కరోనా మృత్యుకేళి... ఊహకందని మరణాలు..
దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ మహమ్మారి కాటుకు రోగుల ప్రాణాలు ఆవిరైపోతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు, అప్పటికే వివిధ రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య మృతుల్లో ఎక్కువగా ఉంటోంది. భారత్ లో ఇప్పటివరకూ 543 మంది కరోనా కారణంగా మృత్యువాత పడగా.. ఏపీలో ఈ సంఖ్య 17గా నమోదైంది. కరోనా ప్రభావం ఏ స్ధాయిలో ఉందంటే ఇప్పుడు ఓ వ్యక్తి చనిపోతే.. అందుకు కారణం కచ్చితంగా కరోనాయే అన్నంతగా ఇతరులను భయపెట్టేలా ఉంది.
కరోనాతో చనిపోతే ఇక అంతే సంగతులు..
గతంలో ఏదైనా రోగంతో కుటుంబ సభ్యులు కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారు కానీ చనిపోతే వందల సంఖ్యలో జనం వచ్చేవారు. హితులు, స్నేహితులు, సన్నిహితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించే వారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనల పేరుతో కరోనా మృతులను సందర్శించేందుకు కూడా ఎవరూ రావడం లేదు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు సైతం మృతుల చివరి చూపుకు సైతం నోచుకోవడం లేదు. మొన్నామధ్య నెల్లూరు డాక్టర్ చెన్నైలో చనిపోతే చివరి చూపులే కాదు అంత్యక్రియలకు సైతం వెళ్లలేని పరిస్దితుల్లో కుటుంబ సభ్యులంతా క్వారంటైన్ లో ఉండిపోవాల్సిన పరిస్ధితి.
గొప్పగా బతికి.. చివరికి అనాథలుగా..
అప్పటివరకూ జీవితమంతా గొప్పగా బతికి, జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో కలిసి శేషజీవితం గడుపుతున్న వారెందరో కరోనా మహమ్మారి సోకి మృతువాత పడితే మాత్రం వారి పరిస్ధితి దారుణంగా మారుతోంది. అంత్యక్రియలకు సైతం పలుచోట్ల కుటుంబ సభ్యులను సైతం అనుమతించకపోవడంతో అనాథ శవాలుగా వారు మిగిలిపోతున్నారు. సాధారణ పరిస్ధితుల్లో గొప్పగా జరిగే అంత్యక్రియలు, చుట్టూ ఉండే కుటుంబ సభ్యులకు బదులుగా కనీసం తల కొరివి పెట్టే వారు కూడా లేక అనాథలుగా అంత్యక్రియలు జరిగిపోతున్నాయి.
అంతిమ లాంఛనాలూ కనుమరుగు..
కరోనా వైరస్ రాకముందు ఓ వ్యక్తి చనిపోతే ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులందరూ వచ్చే వరకూ ఆగి సాంప్రదాయబద్ధంగా లాంఛనాలతో స్మసానాలకు తరలించి అంత్యక్రియలు నిర్వహించే వారు. చనిపోయిన కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలను సైతం అంతే గౌరవంగా పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. కరోనా సోకిన కుటుంబ సభ్యుడి అంత్యక్రియల్లో పాల్గొని శవాన్ని తాకితే తమకు ఎక్కడ కరోనా సోకుకుందేమోనన్న భయం వారిలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులే కాదు చుట్టుపక్కల వారు సైతం అంత్యక్రియలకు రాలేని పరిస్ధితి.
మంటగలుస్తున్న మానవత్వం..
కరోనా వైరస్ రాకముందు ఏదైనా రోగం వచ్చి కుటుంబ సభ్యుడు కానీ, స్ధానికంగా ఉండే వారు కానీ చనిపోతే అంత్యక్రియలకు జనం తరలి వెళ్లేవారు. కానీ ఇప్పుడు తమకు వైరస్ సోకుతుందన్న భయాలతో ఎలా తప్పించుకోవాలా అని కారణాలు వెతుక్కుంటున్న పరిస్దితి కనిపిస్తోంది. దీంతో మానవత్వం మంటగలుస్తోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తాము ఈ స్ధితిలో ఉండటానికి కారణమైన వారికి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాని పరిస్దితులు కొన్నయితే.. పరిస్దితులు సహకరించక, అధికారులు అనుమతులు ఇవ్వక మరికొన్ని చోట్ల నెలకొంటున్నాయి. దీంతో అంతిమంగా కరోనా వైరస్ రాకతో మానవత్వం కనుమరుగైందా అన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే భవిష్యత్తులో కరోనా మృతులు మరింత పెరిగితే పరిస్ధితి ఎంత దారుణంగా మారుతుందో అన్న భయాలు నెలకొంటున్నాయి.
Recommended Video