చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ: టీడీపీ మేనిఫెస్టో ఉపసంహరణకు ఆదేశాలు, ప్రచారానికీ ‘నో’
అమరావతి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీల గుర్తులే లేని ఎన్నికలకు మేనిఫెస్టోనా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును దుయ్యబట్టారు. అంతేగాక, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.
మేనిఫెస్టోను విత్ డ్రా చేసుకోవాలని టీడీపీకి ఆదేశం
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) తీవ్రంగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. మేనిఫెస్టోపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. టీడీపీ మేనిఫెస్టోపై అందిన ఫిర్యాదు, టీడీపీ వివరణ పరిశీలించిన అనంతరం ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశించింది.
మేనిఫెస్టోపై ప్రచారం కూడా వద్దు: టీడీపీకి తేల్చేసిన ఈసీ
అంతేగాక, టీడీపీ మేనిఫెస్టో ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే జిల్లాలకు పంపిన మేనిఫెస్టోలను వెనక్కి తీసుకోవాలని టీడీపీకి తేల్చి చెప్పింది. అంతేగాక, ఆ మేనిఫెస్టోపై ఇక ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని టీడీపీకి స్పష్టం చేసింది. కాగా, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 'పల్లె ప్రగతి పంచ సూత్రాలు' పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎస్ఈసీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టీడీపీకి నోటీసులు జారీ అయ్యింది.
ఎన్నికలు సజావుగానే..: ఎస్ఈసీ
ఇది ఇలావుంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గురువారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల నిర్వహణపై ఒంగోలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారుల చర్యలతో జిల్లాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ నడుచుకుంటోందన్నారు రమేష్ కుమార్. గ్రామాల్లో రాజకీయ చైతన్యం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు.
ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు కానీ..
ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని వైసీపీ సర్కారునుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారమే పంచాయతీలకు నిధులు వస్తాయన్నారు. తాను సాధారణ ఏకగ్రీవాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే, ఏకగ్రీవాలు గుడ్డిగా ఆమోదించ వద్దని తాను స్పష్టంగా చెప్పానన్నారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆయన.. వాటిపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో ఏకగ్రీవాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. శాసన సభకు పోటీ ఉండాలి... కానీ, గ్రామాలకు మాత్రం వద్దా? అని ఎస్ఈసీ నిలదీశారు.