హామీ ఇచ్చారు..అమలు చేశారు: ప్రత్యేక హోదా ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత..బేషరతుగా!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో మరొకటిని అమలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేశారు. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిశోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏ రూపంలో ఉద్యమించినా, ఆయా కేసులు ఏ స్థాయిలో ఉన్నా.. ఎత్తివేత వర్తిస్తుందని స్పష్టం చేశారు. కేసులను ఎత్తివేసేలా వెంటనే న్యాయస్థానాల్లో పిటీషన్లను దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశించారు.
మొత్తం సినిమా అయిపోయేటప్పటికీ దేశం దివాళా తీస్తుందేమో: మోడీపై కౌంటర్ అటాక్
13 జిల్లాలతో ఏర్పాటైన ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ కూటమి ఓడిపోవడం, ఎన్డీఏ అధికారంలో రావడం చకచకా జరిగిపోయాయి. అప్పటి ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను సాధించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదాలో నిరాహార దీక్షలు, యువ భేరీ సదస్సులను నిర్వహించారు. ఫలితంగా- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ యువతతో పాటు పలువురు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు.
హోదా కోసం ఉద్యమించిన వారిని జైల్లో పెడతామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దీనికి అనుగుణంగా ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ హోదా ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. తాము అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆయా కేసులన్నింటినీ ఎత్తివేస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. పాదయాత్రలోనూ ఆయన ఈ హామీని పలుమార్లు ప్రస్తావించారు. ఈ హామీని వైఎస్ జగన్ నిలుపుకొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. హోదా ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేశారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.