నీటిలో లేకున్నా చేప బతుకుతోంది, కానీ చంద్రబాబు అలా కాదు: అంబటి రాంబాబు సెటైర్లు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రను ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. కానీ ఆయన మాత్రం అబద్దాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో ఇంటి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.40 కోట్లు ఖర్చు చేశారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కార్యాలయం కోసం రూ.2.8 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించిందని.. కానీ తర్వాత వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడుల నుంచి దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర చేపట్టారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. నీటిలో చేప బయటకొచ్చినా బతుకుతుంది.. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అధికారం లేకుంటే ఉండలేకపోతున్నారని తెలిపారు. అధికారం లేకుంటే గిల గిల కొట్టుకుంటున్నారని విమర్శించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పెన్షన్ ఇస్తామని అంబటి రాంబాబు స్పష్టంచేశారు. అర్హత కలిగిన వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పెన్షన్ ఇస్తామని చెప్పారు.
ఇటీవల టీడీపీ చేస్తోన్న ఆరోపణలు చూస్తే నవ్వొస్తుందని అంబటి రాంబాబు తెలిపారు. పెన్షన్ రాక అవ్వ చనిపోయిందని కథనాలు రాస్తున్నారని చెప్పారు. మేం మీలాగా కాదని అంబటి స్పష్టంచేశారు. అర్హులయితే పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ పెన్షన్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో మీరు సైకిల్ గుర్తుకు ఓటేసిన వారికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇటీవల చనిపోయిన వ్యక్తులను కూడా తమకు అనుకూలంగా మార్చుకొన్న గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అమరావతిలో చనిపోతే.. రాజధాని కోసం ప్రాణం పోయిందన్నారు. అంతకుముందు చనిపోయిన వారిని ఇసుకలేదని తనువు చాలించారని ప్రచారం చేశారు. ఏదో సమస్యతో చనిపోతే దానిని చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.