'దయచేసి.. నా కాపురాన్ని నిలబెట్టండి.. అత్తనే ఇదంతా చేస్తోంది'
గుంటూరు: తనపై కక్ష గట్టిన అత్త భర్తను తన నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తోందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె టీడీపీకి చెందిన నాయకురాలని, ఆమెను తన జోలికి రాకుండా చూడాలని ఆమె కోరుతోంది. ఇదే విషయాన్ని విన్నవించుకుందామని గురువారం చంటిబిడ్డను ఎత్తుకుని ఆమె సీఎం నివాసం వద్దకు వచ్చింది.
అయితే ఆమె గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి ఇంటిముఖం పట్టింది. ఆమె పేరు పిల్లి మేరీగా సమాచారం. దకాకాని మండలం ఉప్పలపాడుకు చెందిన పిల్లి కోటయ్యతో మూడేళ్ల క్రితం ఆమె వివాహం జరిగింది. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం కోటయ్య కుటుంబ సభ్యులకు నచ్చలేదు.
ఈ నేపథ్యంలో గుంటూరులోని చుట్టుగుంటలో వీరు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఓ పాప కూడా పుట్టింది. కోటయ్య తల్లి పిల్లి లీల ప్రస్తుతం వార్డు మెంబరుగా ఉన్నారు. వీరిద్దరి వ్యవహారంపై ఆమె పెదకాకాని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల మేరీ, కోటయ్యలను పిలిచి విచారించారు. దీంతో తామిద్దరం ఇష్టపడే ప్రేమ వివాహం చేసుకున్నామని వారు పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు కేసు మూసివేశారు.
అయినా అత్త పిల్లీ లీల మాత్రం తమను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఆమె ప్రయత్నాలను నిలువరించి తన కాపురాన్ని నిలబెట్టాలని ఆమె వాపోతున్నారు.