మంత్రి అమర్నాథ్ రెడ్డిని గుడిసెలోకి లాక్కెళ్లిన వృద్ధురాలు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ వృద్ధురాలు మంత్రిని తన ఇంటిలోకి లాక్కెళ్లింది. తమ పరిస్థితి చూడాలంటూ ఆయనతో వాపోయింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని పెద్ద పంజాణిలో సోమవారం నాడు చోటు చేసుకుంది.
ఓ అవ్వ ఏళ్లుగా తన సమస్యలను అధికారులకు చెప్పుకుంటోంది. కానీ ఆమె సమస్య తీరలేదు. సోమవారం మంత్రి అమర్నాథ్ రెడ్డి అక్కడ పర్యటించారు. అప్పటికే విసిగిపోయి ఉన్న వృద్ధురాలు మంత్రి అమర్నాథ్ రెడ్డిని కలిశారు.
ఆయన వీధిలో కనిపించగానే ఆయన వద్దకు వెళ్లి తన కష్టాలను చెప్పుకుంది. ముందు మా గుడిసె చూద్దువు రా అంటూ ఆయనను తీసుకెళ్లింది. తన గుడిసెలోకి లాక్కెళ్లింది. తన భర్తకు పింఛన్ రావడం లేదని, అది వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
చలికి వానకు గుడిసెలో ఉండలేకపోతున్నామని, రేకుల ఇళ్లయినా ఇప్పించాలని మంత్రిని ఆమె కోరింది. వెంటనే స్పందించిన అమర్నాథ్ రెడ్డి పింఛన్, పక్కా ఇళ్లు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.