ఈమె కి'లేడి'...వాడో కిలాడి...ఇద్దరూ "నిత్య పెళ్లి" బాపతే..ఒకేరోజు దొరికారు...విచిత్రం
ఆమె అందమే ఆమెకు పెట్టుబడి...మాయమాటలే ఆమె ఆయుధం...అలా దశాబ్ధకాలంగా ఎంతోమందిని ప్రేమ-పెళ్లి పేరుతో ఛీట్ చేసి ఎన్నోసార్లు పోలీసు రికార్డులకు ఎక్కిందో మాయలాడి. తాజాగా మరోసారి అదే పని చేసి మరోసారి అరెస్ట్ అయింది. మరోవైపు ఇదే టైపులో అమాయక మహిళల్ని మోసగిస్తున్నాడో కేటుగాడు. డాక్టర్ నని చెప్పుకునే ఈ కిలాడీ యాక్టర్ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ మాయం అవుతుంటాడు. అయితే ఎట్టకేలకు పాపం పండింది...పోలీసులకు దొరికిపోయాడు...
ఇలా ఒకేరోజు...ఒక నిత్య పెళ్లికూతురు...నిత్య పెళ్లికొడుకు పోలీసులకు దొరికిపోవడమే విచిత్రం...వీరిద్దరూ తమ మోసాలకు వేదికగా "మ్యాట్రిమోని" నే ఎంచుకోవడం మరో విచిత్రం. ఇంతకీ ఈ కి'లేడి' పేరు వల్లపూరి దీప్తి..కాగా...కిలాడి నిత్య పెళ్లికొడుకు పేరు రమణబోయిన ఆంజనేయులు అలియాస్ చిలుకూరి వీరాంజనేయులు...
మాయలాడి...తాజా మోసం...
గుంటూరు నగరానికి చెందిన వల్లపూరి దీప్తికి ఆల్రెడీ పెళ్లయింది. అందరికీ తెలిసి ఇది నాలుగో పెళ్లి...తెలియకుండా ఎన్ని పెళ్లిళ్లు చేసుకొని ఎంతమందిని మోసగించిందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈమె బారిన పడే వాళ్లందరూ హై రేంజ్ ప్రొఫెషనల్ జాబ్ హోల్డర్స్...తాము మోసపోయామని తెలిసి కూడా పరువు పోతుందని సైలెంట్ గా వెళ్లిపోయిన రకం...కట్ చేస్తే...అలా అదేక్రమంలో గుంటూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లాడిన వల్లపూరి కొంతకాలంగా కృష్ణాజిల్లా పెనమలూరులో నివాసం ఉంటుంది. ఇక్కడ కూడా మ్యాట్రిమోనిలో నకిలీ ప్రొఫైల్తో యువకులకు ఎరవేసి, వాళ్ల నుంచి లాగేసిన డబ్బులతో విలాసవంతంగా జీవించడాన్ని అలవాటుగా మార్చుకొందని పోలీసులు చెబుతున్నారు. అలాగే అమెరికాలో ఉంటున్న విజయవాడకు చెందిన ధరణీకుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ధరణీకుమార్ తన బయోడేటాను మ్యాట్రిమోని వెబ్సైట్లో అప్లోడ్ చేయగా, అదే సైట్లో దీప్తి తన ప్రొఫైల్ను ఉంచింది.
మోసం చేసింది ఇలా...అయితే దొరికిపోయింది...
కాకపోతే, మ్యాట్రిమోని ప్రొఫైల్ లో తన ఫొటోకు బదులు ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టింది. అసలు పేరుకు బదులు సాయి ధన్య భీమనేని అని పేర్కొంది. ఆ ప్రొఫైల్ నచ్చి, ధరణీకుమార్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో దీప్తి అతని నుంచి రూ.1.99 లక్షలను లాగేసింది. ఆ తరువాత నుంచి ఆమె ధరణీకుమార్తో సంబంధాలకు ఫుల్స్టాఫ్ పెట్టి మొబైల్ నంబర్ మార్చేసింది. దీంతో తాను మోసపోయినట్టు ఆలస్యంగా తెలుసుకున్న ఆయన, ఫోర్త్ లయన్ యాప్లో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు...దీప్తి హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతా ఆధారంగా ఆమెను పట్టుకొన్నారు. దీప్తి ఇంతకు ముందు మరి కొంతమందిని ఇలాగే మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెపై పెనమలూరు, హైదరాబాద్లోనూ కేసులు ఉన్నాయంటున్నారు.
గతంలో...ముగ్గురితో వివాహం...ముగ్గురితో సహజీవనం
గుంటూరు బ్రాడీపేటకు చెందిన వల్లపూరి దీప్తికి...దీపికారెడ్డి, సూర్యదీప్తి అనే మారు పేర్లు ఉన్నాయి. ఇలా ఇంటర్నెట్ స్నేహాలతో, మ్యాట్రిమోని పరిచయాలతో తాను డాక్టర్నని...టెక్కీనని చెప్తూ పదేళ్ల కాలంలో ముగ్గుర్నిమనువాడి...మరో ముగ్గురితో సహజీవనం చేసింది. గతంలో ఇలాగే ఓ ప్రవాస భారతీయుడిని అలాగే మోసం చేసి రూ. 15 లక్షల మేర టోకరా వేసి పోలీసులకు దొరికిపోయింది. ఆ తరువాత బెంగుళూరులో మకాం...మరో వ్యక్తిని ఛీటింగ్, ఆ తరువాత మళ్లీ రాజమండ్రిని వ్యక్తితో పెళ్లి...ఇలా దీప్తి మీద గుంటూరు, తిరుపతి ఇతర ప్రాంతాల్లోను కేసులున్నాయి...అరండల్పేట పోలీసులు దీప్తిపై సస్పెక్ట్ షీటును కూడా తెరిచారు. మరోవైపు దీప్తి ఇంటర్నెట్, ఫోన్ల ద్వారా పరిచయమైన మరో ముగ్గురితో సహజీవనం సాగించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు.
దీప్తికి...ఫ్లాష్ బ్యాక్...
అయితే దీప్తి ఇలా మోసాలకు పాల్పడటం వెనుక ఆమె మొదట్లో ప్రేమ పేరిట మోసపోవడమేనని కొందరు చెబుతున్నారు. తాను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న సందర్భంలో ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి తాను మలేషియాలో పారిశ్రామికవేత్తనని చెప్పటంతో అతడి ప్రేమలో పడి, వివాహం చేసుకుందదట. అయితే అతడు చెప్పినవన్నీ అబద్ధాలని పెళ్లైన తర్వాత బయటపడటంతో నెల రోజులకే తెగతెంపులు చేసుకుందట. అప్పట్నుంచే ఆమె ఇలా మారుపోయిందట...అయితే మరి కొందరేమో దీప్తి వాళ్లది ఒకప్పుడు బాగా కలిగిన కుటుంబమని అయితే తండ్రి అర్థాంతరంగా చనిపోవడంతో ఈమె తల్లితో కలసి ఇలాంటి మోసాలకు పాల్పడుతోందని చెబుతున్నారు.కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. పీజీ సర్టిఫికెట్లు ఇస్తామని పలువురు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి పరారైన కేసులో 2004లో దీప్తి, ఆమె తల్లి పూర్ణవల్లిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం గమనార్హం.
ఇతడో కిలాడి...నిత్య పెళ్లికొడుకు...
డాక్టర్గా చలామణి అవుతూ అమాయక మహిళలను పెళ్లిళ్లు చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న కేసులో నిందితుడైన రమణబోయిన ఆంజనేయులు అలియాస్ చిలుకూరి వీరాంజనేయులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి మోసాలపై గత నెల మీడియాలో వార్తలు రాగా అప్పటి నుంచి ఆంజనేయులు పరారీలో ఉన్నాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆంజనేయులు డిగ్రీ చదివి మెడికల్ రిప్రజంటేటివ్గా, కాంపౌండర్ గా పని చేశాడు. ఆ అనుభవంతో డాక్టర్ నని చెప్పుకుని 2002లో ఇంకొల్లులో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె నుంచి పెద్ద మొత్తంలో కట్నం గుంజాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఆమెను వేధించి విడాకులు తీసుకున్నాడు. 2006లో కారంపూడికి చెందిన మరో మహిళను పెళ్లి చేసుకుని పెద్ద మొత్తంలో కట్నం లాగి ఆమెనూ వదిలేశాడు.
Recommended Video
గుట్టు రట్టయింది...ఇలా కటకటాల పాలయ్యాడు...
ఆ తర్వాత కొంత కాలం పిడుగురాళ్ల, వినుకొండ, చెరుకుపల్లిల్లో డాక్టర్గా చలామణి అవుతూ ఆస్పత్రులు కూడా నిర్వహించాడు. మళ్లీ గత ఏడాది ఫిబ్రవరిలో జొన్నలగడ్డకు చెందిన ఓ యువతి వివరాలు మ్యాట్రిమోనిలో చూసి మోసగించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె వీరాంజనేయులు వ్యవహారశైలిపై అనుమానంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ కిలాడి నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టయింది....ఇలా ఒకే రోజు...నిత్య పెళ్లికూతురు...నిత్య పెళ్లి కొడుకు పోలీసులకు పట్టుబడటం...ఇద్దరికీ గుంటూరు నేపథ్యం ఉండటం....యాధృచ్చికమే అయినా విచిత్రం కూడా...