కలకలం:సిఎం చంద్రబాబు నివాసం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం,సిబ్బంది అప్రమప్తతతో తప్పిన ముప్పు
విజయవాడ:ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఒకఓ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనతో కలకలం రేగింది. తన భర్తకు ప్రమాదం జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుంది.
అయితే అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే ఆమెని అడ్డుకోని ఆత్మహత్యాయత్నాన్ని భగ్నం చేశారు. ప్రజాదర్బార్ సందర్భంగా ముఖ్యమంత్రికి వినతి ఇచ్చేందుకని వచ్చి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ విజయవాడ, ఎనమలకుదురుకు చెందిన వివాహిత గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే...
కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన వెలగపూడి సీత అనే మహిళ సోమవారం సీఎం నివాసం వద్దకు చేరుకుంది. తన భర్త తెలుగుదేశం పార్టీ నేతేనని...అయితే ఇటీవలే అతడికి ప్రమాదం జరుగగా...చికిత్స కోసం 20 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని ఆమె తెలిపింది.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేసినా అది ఏమాత్రం సరిపోలేదని...ఇంకా ఆయనకు వైద్యం చేసేందుకు డబ్బులు కావాలని ఆమె చెబుతోంది. ఆ సాయం కోసం ఐదు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల గురైన తమ కుటుంబం పోషణ కూడా కష్టమవడంతో చివరిసారిగా సాయం అడిగి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు ఆమె చెబుతోంది.
మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆమె భర్త వైద్య చికిత్స కోసం రూ. 13 లక్షలు మంజూరయ్యాయని...అయితే ఆ మొత్తం వైద్య ఖర్చులకు కూడా సరిపోకపోవడం కారణంగా మరింత సాయం కోసం ఆ మహిళ ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.