ప్రేమించానని రెండేళ్లు కాపురం: అక్క కూతురితో రహస్య వివాహం, మొదటి భార్య ఇలా..
ప్రేమించానని నమ్మించి రెండేళ్ల పాటు కాపురం చేసిన ఓ వ్యక్తి రహస్యంగా మరో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మనస్తాపానికి గురైన మొదటి భార్య పెద్దల సమక్షంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అమలాపురం: ప్రేమించానని నమ్మించి రెండేళ్ల పాటు కాపురం చేసిన ఓ వ్యక్తి రహస్యంగా మరో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మనస్తాపానికి గురైన మొదటి భార్య పెద్దల సమక్షంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
ఆమెను అమలాపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన పొణకల సూర్యచంద్ర కృష్ణకుమారి(27) డిగ్రీ వరకు చదువుకుంది. కుటుంబాన్ని పోషించడానికి అమలాపురం పరిసర ప్రాంతాల్లో హెర్బల్ వెయిట్లెస్ ప్రొడక్ట్స్ విక్రయించేది.
అదే కంపెనీలో పనిచేస్తున్న చిందాడగరువు గ్రామానికి చెందిన పొణకల నాగేంద్రబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.
దేవుడి పటం ముందు...
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 2013లో ఓ అద్దె ఇల్లు తీసుకుని దేవుని పటాల ముందు కృష్ణకుమారి మెడలో నాగేంద్రబాబు తాళి కట్టి పెళ్లి చేసుకున్నానని నమ్మించాడు. రెండేళ్లపాటు వారి కాపురం సాగింది. వారికి కుమారుడు కూడా పుట్టాడు. అదే సమయంలో పాలకొల్లులో నాగేంద్రబాబు ఓం వెంకటేశ్వర మెడికల్ షాపు ప్రారంభించాడు.
కట్నం ఇవ్వకపోవడంతో...
కట్నం కింద కృష్ణకుమారి కుటుంబ సభ్యులు ఏమీ ఇవ్వలేదు. దీంతో రూ.3 లక్షలు తీసుకురావాలని కృష్ణకుమారిని డిమాండ్ చేశాడు. చివరకు ఆమె తల్లిదండ్రులు రూ.2 లక్షలు ఇచ్చి బిడ్డ పేరున బ్యాంకులో వేయాలని సూచించారు. అయితే నాగేంద్రబాబు సొంత ఖర్చులకోసం, తల్లిదండ్రులకోసం ఆ సొమ్ము ఖర్చు పెట్టాడు. ఇటీవల కాలంలో భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన కృష్ణకుమారి అతని సెల్ఫోన్ను పరిశీలించింది.
ఆ పెళ్లి పోటోలు బయటపడ్డాయి...
తన అక్క కూతురైన సత్య వెంకటసుగ్రీని నాగేంద్రబాబు వివాహం చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు ఆమెకు కనిపించాయి. దీనిపై నాగేంద్రబాబును ప్రశ్నించడంతో ఆగ్రహించిన అతను కృష్ణకుమారి, ఆమె బిడ్డను ఇంటినుంచి పంపించేశాడడు. దీంతో ఆమె రావులపాడులో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం అమలాపురం కల్వకొలను వీధిలోని కల్వకొలను తాతాజీ స్వగృహం వద్ద సమస్య పరిష్కారానికి ఇరువురు పెద్దలు వచ్చారు.
అనుచితంగా ప్రవర్తించారు...
పెద్దలు మాట్లాడుతున్న సమయంయలో కృష్ణకుమారి పట్ల భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడికక్కడే పెద్దల సమక్షంలో పురుగులమందు తాగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.