అఫైర్: పిల్లలకు విషమిచ్చి ప్రియుడితో పాటు తాగిన స్త్రీ
వరంగల్: అక్రమ సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. తన ఇద్దరి చిన్నారులకు విషమిచ్చి, ఓ మహిళ ప్రియుడితో కలిసి తానూ విషం తాగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలంలో సంచనలం సృష్టించింది. కురవి మండలం సూదనపల్లి గ్రామానికి చెందిన తోట పాపయ్యకు 2003సంవత్సరంలో నల్గొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మట్టగజపు లింగయ్య కూతురు రమ(కవిత)తో వివాహం జరిగింది.
వీరికి గీతిక(4), సాయిదీప్తి (6నెలలు) ఇద్దరు కూతుళ్లు సంతానం. కొద్ది సంవత్సరాల క్రితం తోట పాపయ్య బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కవితకు తమ స్వగ్రామం గోవిందాపురం ఊరి పక్కనే ఉన్న గోరికొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీపాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొద్దికాలానికి కుటుంబంతో సహా పాపయ్య తన స్వగ్రామం సూదనపల్లి గ్రామానికి తిరిగి వచ్చాడు. స్వగ్రామానికి తిరిగి వచ్చాక కూడా కవిత తరచూ నూతన్కల్ వెళ్తూ శ్రీపాల్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది.
ఈ క్రమంలో 6 రోజుల క్రితం తన ఇద్దరు చిన్నారులను వెంట తీసుకుని ఇంటి నుంచి కవిత వెళ్లింది. అయితే శనివారం మధ్యాహ్నం ప్రియుడితో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లి పక్కన ఉన్న చిట్యాల గుట్టల సమీపంలోకి వెళ్లింది. అక్కడే ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తన ప్రియుడితో కలసి తాను విషం తాగింది. ఈ ఘటనలో పెద్ద కూతురు గీతిక అక్కడికక్కడే మృతిచెందింది.
గుట్ట సమీప ప్రాంతంలోకి పనుల మీద వెళ్లిన స్థానికులు అపసార్మక స్థితిలో పడి ఉన్న చిన్న పాప సాయిదీప్తి, కవిత, శ్రీపాల్లను గుర్తించారు. వెంటనే వారిని 108 అంబులెన్స్లో నార్కట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.