తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత...సెల్ టవర్ ఎక్కి మహిళ నేత నిరసన
పశ్చిమగోదావరి: జిల్లాలోని భీమవరం మండలం తుందుర్రు గ్రామం లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఫాక్టరీ వ్యర్ధాలను తరలించేందుకు పైపులైన్ నిర్మాణాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు.
ఇప్పటికే పలుసార్లు ఈ పైల్ లైన్ నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు తాజాగా మరోసారి జొన్నలగరువులో ఈ పనులను అడ్డుకున్నారు. దీంతో పుడ్ పార్క్ సిబ్బంది, గ్రామస్తుల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పుడ్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటి నాయకురాలు ఆరేటి సత్యవతితో మరో ఇద్దరు యువకులు మత్సపురి గ్రామం లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అంతేకాదు పనులు నిలిపివేయని పక్షంలో టవర్ పై నుంచి దూకుతామని వారు హెచ్చరించారు.
దీంతో స్పందించిన అధికారులు పైప్ లైన్ నిర్మాణం నిలిపివేసేందుకు హామీ రావడంతో సత్యవతి దీక్ష విరమించి సెల్ టవర్ పై నుండి కిందకు దిగింది. దీంతో పరిస్థితి సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ ఫాక్టరీ వ్యర్ధాల పైప్ లైన్ నిర్మాణం జరిపేందుకు ఆ సంస్థ పట్టువీడకుండా ప్రయత్నాలు జరుపుతుండటంతో తుందుర్రు పరిసర ప్రాంత గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
మరోవైపు ఈ పైప్ లైన్ పనులు నిలిపివేయాలంటూ మరో ఇద్దరు రైతులు కొప్పర్రులో సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టినట్లు తెలిసింది. పైపులైన్ల నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకుంటారనే నెపంతో గ్రామంలో భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. ఇళ్లలో నుంచి గ్రామస్తులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.