కోడలితో వ్యభిచారం: అత్త, కానిస్టేబుల్ అరెస్ట్
చిత్తూరు: కట్నం కోసం కోడలితో వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన అత్త, ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కట్నం తక్కువగా ఇచ్చారనే కారణంతో బాధితురాలిపై అత్త తరచూ వేధింపులకు పాల్పడేది. అనారోగ్య కారణంతో బాధితురాలి భర్త మంచాన పడ్డాడు. ఈ క్రమంలో 13రోజుల క్రితం వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ కానిస్టేబుల్ను అత్త తమ ఇంటికి తీసుకుని వచ్చింది. డబ్బు వస్తుందనే ఉద్దేశంతో అతని కోరిక తీర్చాలని కోడలిపై ఒత్తిడి తీసుకొచ్చింది.
అందుకు అంగీకరించని కోడలు.. దూషించడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్. అయితే మరుసటి రోజు అతడ్ని ఇంటికి తీసుకొచ్చిన అత్త, అతడ్ని ఇంట్లోకి పంపించి బయటికి తాళం వేసింది. అప్పుడు కూడా అతని బారి నుంచి బాధితురాలు తప్పించుకుంది. ఆ తర్వాత రెండు రోజులకు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి తన కోరిక తీర్చాలని లేదంటే నీ కొడుకును చంపేస్తానని బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు.
ఆమె లొంగకపోవడంతో ఏప్రిల్ 11న బాధితురాలి కొడుకుకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పింది. ఆస్పత్రిలో చేర్పించామని, వెంటనే రావాలని బాధితురాలిని తనవెంట తీసుకెళ్లింది అత్త. ఆస్పత్రికని లాడ్జీకి తీసుకెళ్లడంతో అత్తతో గొడవపడింది బాధితురాలు. కాగా, బలవంతంగా లాడ్జీలోకి తీసుకెళ్లి కానిస్టేబుల్ ఉన్న గదిలోకి తోసేసి బయటికి వచ్చేసింది.
కాగా, అత్యాచార యత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ బారినుంచి మరోసారి తప్పించుుకున్న బాధితురాలు, నేరుగా తన పుట్టింటికి వెళ్లింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పి, తన తల్లి, సోదరుడి సాయంతో ఆమె గత శుక్రవారం డిఎస్పీకి ఫిర్యాదు చేసింది. డిఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బుధవారం బాధితురాలి అత్త, నిందిత కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకున్నారు.