గుంటూరు-కాచిగూడ రైల్లో దారుణం: శవాన్ని మూటగట్టి టాయిలెట్లో పడేశారు
హైదరాబాద్: గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైలులో దారుణం జరిగింది. గుర్తుతెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి 10.45 గంటలకు కాచిగూడ చేరుకున్న గుంటూరు ప్యాసింజర్ (57326) రైలు జనరల్ బోగి టాయిలెట్లో మహిళ మృతదేహం లభ్యమైంది.
ఆదివారం ఉదయం సిబ్బంది రైలను శుభ్రం చేస్తుండగా ఓ గోనె సంచిలో మూటగట్టి ఉన్న మహిళ శవాన్ని గుర్తించారు. దీనిని గమనించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఎవరో ఆమెను హత్య చేసి టాయ్ లెట్లో పడేసి వుంటారని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. కొన్ని గంటల క్రితమే మహిళ హత్య జరిగి వుంటుందని భావిస్తున్న పోలీసులు ఒక్కరైనా ఫిర్యాదు చేయకపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు.
పెనుకొండ రైల్వేగేటు వద్ద ట్రాఫిక్జామ్
అనంతపురం జిల్లాలోని పెనుకొండ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని రైల్వే గేటు వద్ద ఆదివారం ఉదయం ట్రాఫిక్ జామ్ నెలకొంది. రైల్వే గేటు మరమ్మతుల్లో ఉందని అప్పటికప్పుడు రైల్వే సిబ్బంది బోర్డు తగిలించి మరమ్మతు పనులు మొదలుపెట్టారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైల్వే గేటు మూసివేయడంతో ఆర్టీసీ బస్సులతోపాటు ఇతరత్రా వాహనాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు వద్ద వాహనాలను టర్న్ తీసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.