నన్ను చాలా సార్లు రేప్ చేశారు..విశాఖలో ఎస్పీకి ఉద్యోగిని ఫిర్యాదు
విశాఖపట్టణం: విశాఖలో ఓ మహిళా ఉద్యోగిని తనపై జనరల్ మేనేజర్, తోటి ఉద్యోగులు అత్యాచారం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో బాధితురాలి పిర్యాదు మేరకు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ ఆదేశించగా ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన వెలుగుచూసింది.
జిల్లాలోని అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో బ్రాండిక్స్కి అనే గార్మెంట్ కంపెనీ ఉండగా దీనికి అనుబంధంగా "షోర్ టు షోర్" అనే దుస్తుల తయారీ ఫ్యాక్టరీ కూడా అక్కడే ఉంది. అయితే ఈ ఫ్యాక్టరీ జిఎం, అక్కడ పనిచేస్తున్న మరో ఐదుగురు సహ ఉద్యోగులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా అనేకసార్లు రేప్ చేశారని అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు...వివరాల్లోకి వెళితే...
చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక దళిత మహిళ, అచ్యుతాపురం మండలంలోని 'షోర్ టు షోర్' ఫ్యాక్టరీలో 2012 నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ జీఎం దిలీప్ పింటోతోపాటు ఉద్యోగులు బాలశంకర్, శ్యామ్సుందర్, వాసుదేవ, నరేష్, సురేష్ తనను సుదీర్ఘకాలంగా లైంగికంగా వేధించడంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశారని ఈ మహిళా ఉద్యోగిని జనవరి 27న జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఫిర్యాదు చేసిన యువతి దళితురాలు కావడంతో దీనిపై స్పందించిన ఆయన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణ జరిపి ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్ తో సహోద్యోగుల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.