రాజధానికి భూమివ్వమని ఎదురు తిరిగిన మహిళ, 'అమరావతి'కి 90 షరతులు!
అమరావతి: ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండ్రాయునిపాలెం లంక భూముల రైతులు అధికారులకు ఎదురు తిరిగారు. ఈ సంఘటన శనివారం నాడు జరిగింది.
కృష్ణా నది కరకట్ట లోపలి వైపు పొలాలను చదును చేసేందుకు అధికారులు వెళ్లారు. అయితే, లంక రైతులు అధికారుల పైన తీవ్రంగా మండిపడ్డారు. మా భూములను భూసమీకరణలో తీసుకోలేదని చెప్పారు. మా భూములకు ఎటువంటి కౌలు చెక్కులు ఇవ్వలేదన్నారు.
అలాంటప్పుడు మా భూముల్లోని పంటలను ఎలా తొలగిస్తారంటూ మహిళా రైతులు ప్రశ్నించారు. దీంతో, అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో వెనక్కి తగ్గారు. మేం చావనైనా చస్తాం కానీ భూముల్లోకి రానివ్వమని వారు చెప్పారు.
పచ్చని అమరావతికి షరతులు
భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని సుమారు తొంబై షరతులతో రాజధాని అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మదింపు ప్రాధికార సంస్థ(అథారిటీ) అనుమతులను మంజూరు చేసింది. వీఎస్ఆర్కే ప్రసాద్ నేతృత్వంలోని పర్యావరణ అప్రైజల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా వీటిని ఇచ్చింది.
మొత్తం ఆరు అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో లేఔట్లు ఉండాల్సిన శాతం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ, జల కాలుష్య నివారణ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం, పర్యావరణాన్ని సంరక్షించడంలో పాటించాల్సిన జాగ్రత్తలను, షరతులను వివరించింది.
90కి పైగా షరతులు పెడుతూ అనుమతులు ఇచ్చామని, ఇవన్నీ తక్షణం అమలు చేయాల్సిన అవసరం రాదని, నగరం పెరుగుతున్న కొద్దీ వీటి అవసరం వస్తుందని, అమరావతి సుందర పర్యాటక, వసతులున్న నగరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ షరతులు పెట్టామని, భవిష్యత్తులో ప్రణాళికాబద్ధమైన రాజధాని అంటే చండీగఢ్ కాకుండా అమరావతి పేరు చెప్పుకోవాలన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అనుమతులను మంజూరు చేశామని ప్రాధికార సంస్థ అధికారులు చెప్పారు.