లైంగిక వేధింపులు... లొంగట్లేదని ఉద్యోగం నుంచి తొలగింపు... విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్పై కేసు...
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) సూపరింటెండ్ అధికారి నాంచారయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం(అగస్టు 8) దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతని కోర్కెలు తీర్చనందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్...
దిశా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ వివి నాయుడు మహిళ ఫిర్యాదుపై మాట్లాడుతూ... ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ మహిళ డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేరిందన్నారు. కోవిడ్ 19 విధులు నిర్వర్తిస్తున్న ఆమె శుక్రవారం రాత్రి దిశా పోలీస్ స్టేషన్కు వచ్చిందన్నారు. జీజీహెచ్ సూపరింటెంట్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని.... అతనికి లొంగనందువల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించాడని ఆరోపించినట్లుగా చెప్పారు.
సాక్ష్యాధారాలు సమర్పించిన మహిళ...
సూపరింటెండ్ నాంచారయ్యపై ఆరోపణలకు సంబంధించి పలు ఫోటోలు,ఆడియో రికార్డింగ్స్ కూడా ఆమె పోలీసులకు సమర్పించినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 354 ఏ,ఐటీ యాక్ట్ 67ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.ప్రస్తుత జీజీహెచ్ సూపరింటెండ్ నాంచారయ్యపై ఆరోపణలు కొత్త కాదు. గతంలోనూ ఆయనపై వైద్యులు,నర్సులు,పారామెడికల్ సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు పలుమార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమపై దుర్భాషాలడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆయన అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే రాజకీయ అండదండల కారణంగానే నాంచారయ్యపై ఇన్నాళ్ల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే...
నిజానికి ఆస్పత్రిలో వైద్య సేవలు,సదుపాయాలను కూడా సూరింటెండ్ పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. పూర్తిగా అవినీతి కార్యకలాపాల్లో మునుగుతూ అక్రమార్జనకు అలవాటు పడ్డారన్న ఆరోపణలున్నాయి. గతంలోనే ఆయనపై చర్యలు తీసుకుని ఉంటే... ఇప్పుడిలా ఓ మహిళా ఉద్యోగికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యేది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నాంచారయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Recommended Video
రాజీ కదురకనే పోలీసుల వద్దకు...
బాధితురాలు దిశా పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి ముందు ఓ రాజకీయ నేత వద్దకు వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కడ రాజీ కుదరకపోవడంతోనే ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ వ్యవహారం తర్వాత సూపరింటెండ్ నాంచారయ్య తనను విధుల నుంచి తప్పించాలని స్వయంగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు(DME)కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రిలో వెలుగుచూసిన ఈ ఘటన మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో... ఏయే నిజాలు బయటపడుతాయో వేచి చూడాలి.