ఆన్లైన్ ఎఫెక్ట్: వ్యాపారుల ఆందోళన, కూకట్పల్లిలో మహిళ హత్య
హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఆన్లైన్లో వస్తువుల అమ్మకాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. మొబైల్స్, వాహనాలు సహా అన్నింటిని ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన పలువురు నగర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నోకియా ఉత్పత్తులను కారుచౌకగా అమ్ముతున్నారని వాళ్లు నిరసన వ్యక్తం చేశారు.
ఆన్లైన్లో నోకియా ఉత్పత్తుల అమ్మకాలను చౌక ధరకు అమ్మడం నిలిపివేయాలని డిమండ్ చేశారు. లేదంటే తాము వాటిని సహా ఇతర ఉత్పత్తులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాగా, ఆన్లైన్లో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రిటైల్ వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది.
కల్తీ డీజిల్ తయారీ ముఠా అరెస్టు
తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో కల్తీ డీజిల్ తయారీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కిరోసిన్తో కల్తీ డీజిల్ తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో రెండు ట్యాంకర్ల కల్తీ డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ డీజిల్ వ్యవహారంలో దుళ్ల కిరోసిన్ డీలర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఆస్తి పంచలేదని దాడి
ఆస్తి పంచడం లేదని కన్నతల్లి పైన ఇనుపరాడ్డుతో దాడి చేశాడో కొడుకు. ఈ దాడిలో తల్లి తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి అతను అక్కడినుంచి పరారయ్యాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగింది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
కూకట్పల్లిలో మహిళ దారుణ హత్య
హైదరాబాదులోని కూకట్పల్లి బృందావన్ కాలనీలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. చోరీకి అడ్డు వస్తుందని దుండగులు మహిళను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మహిళ వద్ద ఉన్న బంగారు గొలుసులు, గాజులు అపహరించారు.