ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది: దుబాయ్ పరారీకి ఎత్తు
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యనే రామ్నాథ్ను చంపినట్లు పోలీసులు తేల్చారు.
దాంతో పోలీసులను రామ్నాథ్ భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసారు. డిఎస్పీ ఎం. చిదానందరెడ్డి, సిఐ సురేష్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వారిద్దరి మధ్య ఇలా గొడవలు
తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె గ్రామ పంచాయతీ తిమ్మయ్యగారి పల్లెకు చెందిన కందల నరసింహులు, నరసమ్మ దంపతుల కొడుకు రామ్నాథ్ మదనపల్లె మున్సిపల్ ఇంజినీర్ వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. అతను వికలాంగుడు. అతనికి నాలుగేళ్ల క్ితం కడప జిల్లా రాజంపేట గురుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెదిన లక్ష్మితో పెళ్లయింది. వారికి పిల్లలు లేరు. కొంత కాలంగా ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
మాజీ ప్రియుడితో చెప్పింది..
భర్తతో తాను పడుతున్న కష్టాలను లక్ష్మి కడప బుడ్డాయపల్లెకు చెదిన తన ప్రియుడు వాకా రామాంజనేయులుతో చెప్పింది. 30 ఏళ్ల రామాంజనేయులుతో పెళ్లికి ముందే లక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. అతనితో కలిసి భర్త హత్యకు ఆమె పథక రచన చేసింది. ఆమె నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడాల్ సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది.
ఇలా చేయవచ్చునని నమ్మించింది...
భర్తను అడ్డు తొలగించుకుంటే లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి దక్కుతుందని, ఇద్దరం కలిసి దుబాయ్కి వెళ్లి ఉండవచ్చునని లక్ష్మి ప్రియుడితో చెప్పింది. ఈ నెల 9వ తేదీ రాత్రి కడప నుంచి ప్రియుడిని రప్పించింది. సిసి కెమెరాలకు చిక్కకుండా అతన్ని రప్పించింది. రహస్యంగా ఉంచింది.
భర్త నిద్రపోయిన తర్వాత
అదేమీ తెలియని భర్త రామ్నాథ్ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అతను నిద్రపోయిన తర్వత రామాంజనేయులుతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. ఆ తర్వాత 167 గ్రాముల బంగారు నగలు, కురవంకలోని ఆమె పేరు మీద ఉన్న రెండు ప్లాట్ల పత్రాలు, ఓ కారు, కొంత నగదు ప్రియుడికి ఇచ్చింది.
దొంగతనం జరిగిందని నాటకం..
భర్త హత్యపై అనుమానం రాకుండా లక్ష్మి నాటకం ఆడి రక్తి కట్టించింది.తెల్లవారు జామున నాలుగున్నర గంటల సమయంలో భర్త రామ్నాథ్ బాత్రూం వెళ్లేందుకు తలుపులు తెరిచాడని, ఆ సమయంలో ఐదుగురు ముసుగు దొంగలు ఇంట్లో చొరబడి భయపెట్టారని, దాంతో భర్త గుండె ఆగి మరణించాడని చెప్పింది. చివరకు పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.