కూతురి భర్తతో అక్రమ సంబంధం...అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన మహిళ... పక్కా స్కెచ్తో...
వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకూ దారితీస్తున్నాయి. ఇతరులపై వ్యామోహంతో కొంతమంది జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ... అతనితో కలిసి భర్తను కడతేర్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఈ హత్యకు పాల్పడింది.
కూతురి భర్తతో వివాహేతర సంబంధం...
సీఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం రంగయ్య చెరువు ఎస్టీ కాలనీలో నాగరాజు(50),మంజుల(40) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యంతో కూతురి వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత మంజులు కూతురి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో అల్లుడు సుబ్రహ్మణ్యంతో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది.
అల్లుడితో కలిసి హత్య...
ఇద్దరి మధ్య మూడేళ్లుగా ఆ సంబంధం కొనసాగుతోంది. ఇటీవల కూతురి ఇంటికి వెళ్లిన మంజుల... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తన భర్తను హత్య చేసేందుకు అల్లుడితో కలిసి స్కెచ్ వేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం... అల్లుడితో కలిసి భర్త నాగరాజును మంజుల కంచెంవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి అతనికి పీకలదాకా మద్యం తాగించారు. అనంతరం కర్రలు,రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఆపై సమీపంలోని ఓ కుంటంలో శవాన్ని పడేసి పారిపోయారు.
ఇలా వెలుగులోకి...
కుంటలో మృతదేహంపై పోలీసులకు సమాచారం అందడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు క్రమంలో మృతుడు నాగరాజు భార్య మంజులపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో మంజుల నేరం అంగీకరించింది. అల్లుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందువల్లే హత్యకు పాల్పడినట్లు వెల్లడించింది. దీంతో మంజులతో పాటు ఆమె అల్లుడు సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరినీ రిమాండుకు తరలించారు.