అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి కుమారుడ్ని చంపిన మహిళ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన కన్న కుమారుడినే హతమార్చింది. రేఖ అనే మహిళ తన ప్రియుడు రాజారావుతో కలిసి కుమారుడిని చంపిన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
కృష్ణా జిల్లా కంకిపాడులో ఈ సంఘటన గతరాత్రి చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం రేఖ మహారాష్ట్ర నుంచి కంకిపాడుకు వచ్చి, రాజారావుతో కలిసి ఉంటోంది. రాత్రిపూట ఏడుస్తూ తమను నిద్రపోనివ్వడం లేదనే కారణంతో కుమారుడిని వారిద్దరు కలిసి చంపినట్లు తెలుస్తోంది.
అర్థరాత్రి కుమారుడిని చంపి శవాన్ని కాలువ గట్టు మీద పడేశారు. శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు. రేఖను, ఆమె రెండో భర్త రాజారావును అదుపులోకి తీసుకుని విచారించారు.
చిన్నారిని తామే చంపామని వారు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. రేఖ మొదటి భర్తకు దూరమై రాజారావుతో కలిసి ఉంటోంది.