దారుణం: పట్టపగలే మహిళా న్యాయవాదిని కత్తులతో నరికి చంపేశారు
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లెలో ఘోరం జరిగింది. పట్టపగలే ఓ మహిళా న్యాయవాదిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్కూటీపై ఇంటికెళ్తున్న మహిళా న్యాయవాది నాగజ్యోతిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. సుమారు 11 కత్తిపోట్లుకు గురైన ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
మదనపల్లెలో ప్రముఖ న్యాయవాది జితేంద్రకు, ఆయన భార్య నాగజ్యోతికి కొంతకాలం నుంచి మనస్పర్థలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాగజ్యోతి స్కూటీపై ఎస్బీఐ కాలనీ నుంచి ప్రశాంత్ నగర్కు వెళ్తుండగా ఒక్కసారిగా దుండగులు కత్తులతో దాడి చేయడంతో, తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మరణించారు.
అయితే భార్యాభర్తల మధ్య వివాదమే ఈ హత్యకు కారణమా? లేదా ఏదైనా కేసు విషయంలో ఇది జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.