థ్యాంక్యూ జగనన్న: ముఖ్యమంత్రితో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు..
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మహిళా శాసన సభ్యులు గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారంతా వైఎస్ జగన్ ను ఆయన ఛాంబర్ లో కలుసుకున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లో మరణ శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకుని రానుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో.. మహిళా ఎమ్మెల్యేలు జగన్ ను కలిశారు.
దేశంలోనే తొలిసారిగా..
మహిళలపై అత్యాచారాలు, హత్యోదంతాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం.. నిందితులకు మూడు వారాల్లో మరణశిక్ష అమలు చేసేలా చట్టాన్ని రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఓ తీర్మానం చేసింది. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై నలుగురు కామాంధులు అత్యాచారానికి, హత్యకు పాల్పడిన ఉదంతం నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కార్ ఈ తరహా చట్టానికి రూపకల్పన చేసింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఏపీనే. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు చేసే వారికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించేలా ఇందులో అంశాలను పొందుపరిచారు.
చట్టాన్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా..
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకోకుండా ఉండటానికి ఉద్దేశించిన దిశ చట్టాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినందుకు మహిళా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కేక్ కట్ చేశారు. చేతికి కంకణాలను కట్టారు. ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజా, విడదల రజిని, ఉండవల్లి శ్రీదేవి, రెడ్డి శాంతి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.