సీటుకు రూ.1 కోటి!: రేణుక అనుచరుడ్ని చెప్పుతో కొట్టిన మహిళ
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అనుచరుల ప్రెస్ మీట్ గురువారం నాడు రసాభాసగా మారింది. ఓ వివాదం విషయమై రేణుక అనుచరుల్లో ఒకరైన సైదులు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయగా.. రామ్జీ అనే వ్యక్తి భార్య కళావతి వచ్చి అడ్డుకున్నారు.
ప్రెస్ మీట్ పెట్టవద్దని హెచ్చరించారు. ఈ సమయంలో ఆమె తన చెప్పు తీసి రేణుక అనుచరుడు అయిన చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది. తన భర్త రామ్జీకి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దీంతో తన భర్త మనస్తాపంతో మృతి చెందాడని ఆమె రేణుక, ఆమె వర్గం పైన మండిపడ్డారు. దీంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత తలెత్తింది.
ఇదీ వివాదం
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తన భర్త రామ్జీకి కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా అసెంబ్లీ టిక్కెట్ ఇప్పిస్తామని చెప్పి రేణుక చౌదరి వర్గం రూ.1.10 కోట్లు తీసుకున్నారని, కానీ టిక్కెట్ ఇప్పించలేదని ఆయన భార్య ఆరోపించారు. అంత డబ్బు ఇచ్చినా టిక్కెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపంతో తన భర్త మృతి చెందాడని చెప్పారు. దీని పైన ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించారు.
వివాదం విషయమై కళావతి బుధవారం మాట్లాడుతూ.. తన భర్తకు వైరా టిక్కెట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని, కానీ టిక్కెట్ ఇవ్వలేదని ఆరోపించారు. తాను ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తానని చెప్పారు. తన భర్త డబ్బులు ఇచ్చినట్లు తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన దగ్గర డబ్బులు తీసుకొని, ఇప్పుడు ఆయన ఎవరో తెలియదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.